లంచం అడిగారని బాధితుడి ఆరోపణ .. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై కంటోన్మెంట్ కు చెందిన ప్రభుత్వాధికారిణి చెప్పుతో దాడి చెయ్యటం సంచలనం గా మారింది. తన కాలికున్న చెప్పు తీసి అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు ఆమె సదరు వ్యక్తిని కొట్టారు . లంచం ఇవ్వనందుకు తనపై ఆ అధికారిణి చెప్పులతో దాడి చేసిందని బాధిత వ్యక్తి ఆరోపిస్తే తాను లంచం అడగలేదని, కావాలని తప్పుడు ఆరోపణలు చేశారని అందుకే చెప్పుతో సమాధానం చెప్పానని చెప్తున్నారు సదరు కంటోన్మెంట్ అధికారిణి.
ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటి నిర్మాణం కోసం అనుమతి కావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్కు చెందిన దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి కంటోన్మెంట్ ఓ అధికారిణికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఆమె అనుమతులు ఇవ్వకుండా లంచం ఇవ్వాలని వేధించిందని న్యాయస్థానానికి వెళ్లి, అనుమతి కోసం ఆర్డర్లు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికారిణి నుంచి స్పందన లేకపోవడంతో అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం ప్రారంభించాడు రామిరెడ్డి . అది తెలిసి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం ఎలా చేస్తారని అక్కడకు వచ్చిన అధికారిణి ప్రశ్నించింది . ఇక తానూ లంచం ఇవ్వలేదనే కక్ష కట్టి మరీ తనను వేధిస్తున్నారని రామిరెడ్డి అధికారిణి సరితపై ఆరోపించారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె నన్నే లంచం అడిగానని అంటావా? అంటూ చెప్పులతో బాధితుడిపై దాడి చేసింది. లంచం ఇవ్వనందుకు సరిత తనపై దాడి చేశారని రామిరెడ్డి అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సరితపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆమె వదిలేసి తనను ఇబ్బంది పెడుతున్నారని రామిరెడ్డి ఆరోపించాడు.దీనికి సంబంధించిన వీడియోను మారేడుపల్లి పోలీసులకు అందజేశాడు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ అధికారుల చుట్టూ మూడేళ్లుగా తిరిగానని చెప్తున్నా బాధితుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నాడు.