తెలంగాణాలోని ఆ జిల్లాలకు కేంద్రం తీపికబురు!
కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి పి ఎం ఈ బస్సు సేవ, పీఎం ఈ డ్రైవ్ వంటి పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 14,028 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం 10,900 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించి వివిధ రాష్ట్రాలకు బస్సులను కేటాయిస్తోంది.
ఆర్టీసీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త
ఇందులో భాగంగా తాజాగా తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్ జిల్లాల ఆర్టీసీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద రాష్ట్రానికి 151 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించింది. ఇందులో వరంగల్ జిల్లాకు 100 బస్సులు, నిజామాబాద్ జిల్లాకు 51 బస్సులు మంజూరైనట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు వెల్లడించారు.

తెలంగాణా ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు అందలేదన్న కేంద్రం
రాజ్యసభలో ఆయన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలను పేర్కొన్నారు. ఈ బస్సులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదనలు అందలేదని ఆయన పేర్కొన్నారు.
అప్పుడే క్షేత్ర స్థాయిలోకి ఈ బస్సులు
ఈ క్రమంలోనే ఈ బస్సుల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు అన్నారు. కేటాయించిన బస్సుల్లో ఒకటి కూడా ఇప్పుడు వరకు రాష్ట్రానికి తరలించలేదని వాటిని నిర్వహణకు అవసరమైన నిర్మాణాలు, విద్యుత్ మౌలిక వసతులు సిద్ధమైన తర్వాతనే బస్సులను క్షేత్ర స్థాయిలోకి పంపించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణా జిల్లాలకు ఈ బస్సుల కేటాయింపు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో కొత్త బస్సులు ప్రయాణికులకు గొప్ప ఊరటను ఇస్తాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి ప్రజల యొక్క రవాణా సేవలను తీర్చడానికి నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన జిల్లాలకు బస్సులు కేటాయింపు చేస్తోంది.












Click it and Unblock the Notifications