తెలంగాణలో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించేందుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది.
పెంచిన బియ్యం కోటాతో కలిపి ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని పేర్కొంది.

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై ఇటీవల తెలంగాణ మంత్రుల బృందం కేంద్రంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్ర ఆహార, ప్రజా పంపిణి వ్యవహారాల శాఖమంత్రి పీయూష్ గోయల్తో మంత్రుల బృందం సమావేశం అయ్యారు. వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రుల బృందం గతంలో కూడా గోయల్ తో భేటీ అయింది. గత భేటీలో కేంద్రం వరిధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చింది.
అయితే లిఖితపూర్వక హామీ మాత్రం ఇవ్వలేదు. బాయిల్డ్ రైస్ విషయంపై కూడా మంత్రులు, కేంద్ర మంత్రితో చర్చించారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఇప్పటికే టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అస్పష్ట విధానం అనుసరిస్తోందంటూ కేంద్రంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు.
Recommended Video
చివరకు తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో విపక్షాలు కూడా కేంద్రంపై విమర్శలు చేశాయి. రాష్ట్రం నుంచి ఖరీఫ్ లో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలును కేంద్రం పెంచింది. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించింది. అంటే.. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుంది కేంద్రం.












Click it and Unblock the Notifications