టీఆర్ఎస్లో సర్దుబాట్లు సవాలే: 30 నుంచి 34 మందిపై వేటు ఖాయమే
హైదరాబాద్: అసెంబ్లీ, లోక్సభ జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్న అధికార టీఆర్ఎస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన గెలుపు గుర్రాల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా సీట్లలో అభ్యర్థుల ఎంపిక నాయకత్వానికి కత్తిమీద సాముగా మారనున్నదని చెప్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
గత మూడేళ్లలో దాదాపు అన్ని జిల్లాల్లో ఇతర పార్టీలనుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. దీంతో పాత, కొత్త నేతలతో అసెంబ్లీ నియోజకవర్గాలు కిక్కిరిసిపోయాయి. మరో ఏడాది మాత్రమే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నా టీఆర్ఎస్ నాయకత్వంలో ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు వీడలేదంటే అతిశయోక్తి కాదు.
టిక్కెట్ల బరిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు
టీఆర్ఎస్లో చేరిన నాయకుల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలూ వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్ కోసమే గులాబీ గూటికి చేరారన్నది బహిరంగ రహస్యం. వీరిలో అత్యధికులు వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నవారే. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కనీసం వెయ్యి మంది ఆశావహులు ఉంటారన్నది ఒక అంచనా. ఈ పరిస్థితుల్లో అధినేత కేసీఆర్ ఏ సమీకరణాల ప్రకారం టికెట్లు ఇస్తారన్నది అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది చివరిలోగా ముందస్తు ఎన్నికలు ముంచుకు వచ్చే అవకాశం ఉందని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం అందడంతో అసెంబ్లీ స్థానాల్లో ‘రాజకీయం'వేగం పుంజుకుంది.
పునర్విభజన జరగకుంటే టిక్కెట్ల కోసం మరీ ఒత్తిడి
టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఉబలాట పడుతున్న నేతలు అయిదు వర్గాలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్పై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు, గత ఎన్నికల్లో ఓడిపోయి నియోజకవర్గ ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు, వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరి టికెట్లు ఆశిస్తున్న వారు... ఇలా మొత్తంగా అయిదు వర్గాల నేతలు ఆశావహులుగా ఉన్నారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగకుంటే టికెట్లకోసం మరింత ఒత్తిడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఫిరాయింపులతో 90కి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలవగా, ఉప ఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. దీంతో ఆ సంఖ్య 65కు చేరగా, వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 25 మందిని కలిపితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 90కి చేరింది. వీరందరికీ టికెట్లు ఇస్తారనుకున్నా, ఇక మిగిలేది కేవలం 29 స్థానాలు మాత్రమే. కానీ, టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య దీనికి పదింతలకు పైనే ఉందని, ఈ లెక్కన వడబోత అంత తేలిక కాదని అంటున్నారు.
సీనియర్లకు నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదనంగా మరో 34 స్థానాలు పెరుగుతాయని, దీంతో కొంత ఒత్తిడిని అధిగమించవచ్చన్న భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. జరగని పక్షంలో పనితీరు ప్రాతిపదికన కొందరు సిట్టింగ్లపై వేటు తప్పదని తెలుస్తోంది. కనీసం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మెడపై కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. ఆశావహుల జాబితాను తగ్గించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టిందని విమర్శలు ఉన్నాయి. దీంతో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రానికి ‘ముందస్తు'కు వెళ్లే ధైర్యం ఉందా? అని సవాల్
ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం కేంద్రానికి ఉందా? అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని అన్నారు. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఉంటుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంపై ప్రజల్లో అసంతప్తి కనిపిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చునని ఆయన అన్నారు. 24 గంటల కరెంట్పై ఎలాంటి ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏపీ విద్యుత్ ఇస్తామన్నా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదన్న కాంగ్రెస్ నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలనూ తీవ్రంగా తప్పుపట్టారు. జైలులో చిప్పకూడు తిన్నవారూ అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తమకు లేదని రేవంత్రెడ్డినుద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.