బాబును అంకుల్ అన్న కెటిఆర్: కెసిఆర్ 'అమరావతి' టూర్ వెనుక..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు. కెసిఆర్ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును 'అన్నా' అంటూ కెసిఆర్ సంబోధించారు.
కెసిఆర్ తనయుడు, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును చంద్రబాబు పలకరించారు. ఆహ్వాన పత్రిక అందిందా అని చంద్రబాబు అక్కడే ఉన్న కేటీఆర్ను అడిగారు. దానికి.. అందింది అంకుల్ అంటూ ఆయన సమాధానమిచ్చారు.
వెళ్లాలా వద్దా?: కెసిఆర్ ఆర్
అమరావతి శంకుస్థాపనకు తనను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా? అని ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ ముఖ్య నేతల నుంచి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే, వెళ్తేనే మంచిదని నాయకులు సూచించారని సమాచారం.
కెసిఆర్ వెళ్లడం వెనుక జిహెచ్ఎంసీ ఎన్నికలు!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు. దీని వెనుక కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. హైదరాబాదులో పెద్ద ఎత్తున సెటిలర్లు ఉన్నారు.
వీరిని మచ్చిక చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన అమరావతి శంకుస్థాపనకు వెళ్లేందుకు అంగీకారం తెలిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి వెళ్లడం ద్వారా హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొల్లగొట్టవచ్చునని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.