నిన్న జై తెలంగాణ: నేడు బంజారాలతో బాబు డ్యాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంజారాలు హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వచ్చారు.
వారితో కలిసి చంద్రబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బంజారాలతో కలిసి చంద్రబాబు డప్పు కొట్టారు. అనంతరం వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి మేళతాళాలతో నృత్యం చేశారు. పలువురు తెలంగాణ నేతలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అని నినదించారు. అంతేకాదు.. అక్కడున్న వారితోబం జై తెలంగాణ అనిపించారు. ఆయన తన ప్రసంగం ముగించిన అనంతరం జై తెలంగాణ అని, కార్యకర్తలతో చెప్పించారు.