దెబ్బకు చంద్రబాబు తట్టా బుట్టా సర్దుకున్నారు.. ఇప్పుడు ఉనికి కోసమే పాట్లు : కేటీఆర్ ఎద్దేవా
తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చారంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి: తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చారంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నగర పంచాయతీ అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రకటించారు. అనంతరం పెద్దపల్లి, మంథని, రామగుండంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడారు.
తెలంగాణలో మిగిలిపోయిన చోటా మోటా టీడీపీ నేతలంతా ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ.. భవిష్యత్తు అంతా టీఆర్ఎస్ దేనని, టీడీపీలో మిగిలిపోయిన వారంతా ఆ పార్టీని వీడితే మేలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారని, ఆ పార్టీ నాయకులు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు జలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ నాయకులు చచ్చిపోయిన వారి సంతకాలతో కోర్టును ఆశ్రయించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ టీడీపీలు రాష్ట్రాన్ని పాలించిన 65 ఏళ్లలో వదిలిన గబ్బును కడిగేందుకే తమకు మూడేళ్లు సరిపోయాయంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగకుండా పని చేసుంటే తెలంగాణకు ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదంటూ జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించిందని చెబుతూ.. కాంగ్రెస్ అంటే గతం, టీఆర్ఎస్ అంటే భవిష్యత్తు అని అభివర్ణించారు.