పెరుగుతున్న చికెన్, గుడ్ల ధరలు.. సామాన్యులకు చుక్కలు.. ఇలా అయితే కష్టమే!
నాన్వెజ్ ప్రియులకు మళ్లీ షాకింగ్ వార్త. గత నెలలో కాస్త తగ్గిన చికెన్ ధరలు మరోసారి ఆకాశం తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.250 దాటిపోయింది. దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్న క్రమంలో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉల్లి ధరలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటే, ఇప్పుడు చికెన్, కోడి గ్రుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.
గత వారం కిలో చికెన్ రూ.230 వద్ద దొరికేది. ఇప్పుడు చాలా చోట్ల రూ.250 నుంచి రూ.270 వరకు కిలో చికెన్ ధర పలుకుతోంది. ఆదివారం కావడంతో చికెన్ కొనేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ధరలు చూసి చాలామంది నిరాశ చెందుతున్నారు. కూరగాయలే కాదు చికెన్, గుడ్లు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. శ్రావణ మాసం పూర్తయిన తర్వాత నుంచే ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

పండుగల సీజన్లో డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల ఇలా జరుగుతోందని చెబుతున్నారు. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.252, డ్రస్స్డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.117కు లభిస్తోంది. కరీంనగర్లో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. విజయవాడలో మరింత ఎక్కువగా చికెన్ ధరలు పెరిగాయి. అక్కడ స్కిన్లెస్ రూ.266, డ్రస్స్డ్ రూ.236, ఫారం లైవ్ రూ.125, రిటైల్ లైవ్ రూ.152 పలుకుతోంది.
కోడి గ్రుడ్ల ధరలు కూడా బాగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. విజయవాడలో 12 గ్రుడ్లు రూ.80, హైదరాబాద్లో రూ.76కు అమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రూ.70 వద్ద ఉండేవి. ఇప్పుడు మరో రూ.6 నుంచి 10 వరకు పెరిగాయి. నిత్యావసరాల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి కిలో రూ.70, చక్కెర, వంటనూనె, గ్యాస్, పాలు కూడా ఇటీవలే పెరిగాయి.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేకపోవడం, పంటలు తగ్గడం వల్ల, కోళ్ళ దాణా ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగటం వలన, చికెన్ ధరలు ఇలా పైకి పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సామాన్య కుటుంబాలకు వంట ఖర్చు మరింత పెరిగిపోయింది. పండుగలు వచ్చినా మాంసం కొనడం కష్టంగా మారుతోంది.












Click it and Unblock the Notifications
