Anandayya వైద్యానికి మందుకు అండగా చిల్కూర్ ఆలయం: గ్లోబలైజ్ చేయాలంటోన్న ప్రధాన అర్చకుడు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న ఆయుర్వేద మందుకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆనందయ్య ఇచ్చిన మందును కంట్లో వేసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి సైతం పెరిగిందనే ప్రచారం ఉంది. దీనికి టీచర్ కోటయ్య ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.
మందును వేసుకున్న తరువాత ఆయన కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ- ఆనందయ్య వైద్యం వల్లే అది సోకిందనడానికి ఎలాంటి రుజువులు లేవు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆనందయ్య మందుపై ప్రశంసలు, విమర్శలు చెలరేగుతోన్న నేపథ్యంలో- చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఆయనకు అండగా నిలిచారు. వివాదాల మాటెలా ఉన్నప్పటికీ- దీన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సీఎస్ రంగరాజన్ వృత్తిరీత్యా చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడే అయినప్పటికీ ఆయన ఉన్నత విద్యావంతుడు, బయోమెడికల్ ఇంజినీర్. బయోమెడికల్ సైన్స్పై రంగరాజన్కు పూర్తి పట్టు ఉంది. నేచురల్ సైన్స్, ఫార్మల్ సైన్స్గా భావించే బయోమెడికల్ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స చేయవచ్చని చెప్పారు. దాన్ని ఆనందయ్య నిరూపించారని వ్యాఖ్యానించారు. ప్లాస్మా థెరపీ, రెమ్డెసివిర్ సాధించలేని పురోగతిని ఆనందయ్య వైద్యం కనపరిచిందని, ఇది స్వాగతించదగ్గ విషయమని అన్నారు.
Recommended Video
చిల్కూరు బాలాజీ దేవస్థానం తరఫున తాము ఆనందయ్య వైద్యానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని రంగరాజన్ చెప్పారు. ఉచితంగా మందును తయారు చేసి ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశ సంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదం, మూలికా వైద్యం కూడా ఒకటని, దానికి అనుగుణంగా ఆనందయ్య ఈ మందును తయారు చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన తయరు చేస్తోన్న మందుపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.