Huzurabad : టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు-కేసీఆర్ మదిలో ఏముంది-సంచలనానికి తెరదీస్తారా..?
హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది. ఈటలకు ధీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. హుజురాబాద్లో మెజారిటీ వర్గాల మద్దతు పొందేలా అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురి పేర్లను పరిశీలిస్తుండగా... ఇందులో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో నుంచే ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారా లేక ఎప్పటిలాగే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ మరో సంచలనానికి తెరదీస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

తెర పైకి ఆమె పేరు...?
హుజురాబాద్లో సామాజిక సమీకరణాలను కేసీఆర్ నిశితంగా స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దళిత సామాజికవర్గంతో పాటు రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ రెండు వర్గాలను ఆకర్షించేలా అభ్యర్థిని ఖరారు చేసే యోచనలో సీఎం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాలతి దళిత సామాజికవర్గం కావడం,ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో రెండు వర్గాల ఓట్లను ఆకర్షించవచ్చునని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కశ్యప్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి...?
ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో భాగమైన కమలాపూర్ గతంలో ప్రత్యేక నియోజకవర్గంగా ఉన్నప్పుడు... ముద్దసాని దామోదర్ రెడ్డి అక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ కుటుంబానికి నియోజకవర్గంలో ఆదరణ ఉందని చెబుతారు. ఇటీవలే ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ముద్దసాని మాలతి పోటీకి అంగీకరించని పక్షంలో కశ్యప్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు,మాజీ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మొదటి నుంచి వినోద్ పేరు...
నిజానికి హుజురాబాద్ అభ్యర్థుల జాబితాలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరు మొదటినుంచి బలంగా వినిపిస్తోంది. గతంలో హన్మకొండ ఎంపీగా పనిచేసిన నేపథ్యం కారణంగా హుజురాబాద్లో ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఉద్యమకారుడు,వాగ్ధాటి ఉన్న నాయకుడు కావడంతో ఈటలపై పోటీకి ఆయనే సరైన అభ్యర్థి అన్న వాదన వినిపించింది. అయితే సామాజికవర్గం ఒక్కటే ఆయనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. పైగా హుజురాబాద్లో పోటీకి వినోద్ కూడా అంత సుముఖంగా లేరన్న ప్రచారం ఉంది.

సంచలనానికి తెరదీస్తారా...
బీసీ కోటాలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్,టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,ఉద్యమకారుడు అరుకాల వీరేశం తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఏముందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. చాలాసార్లు ఆయన నిర్ణయాలు అంచనాలకు అందని రీతిలో ఉంటాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవిని రంగంలోకి దింపి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును చిత్తు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలోనూ ఆయన సంచలనానికి తెరదీస్తారా అన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ టీఆర్ఎస్ వర్గాలన్నీ హుజురాబాద్లో మోహరించి ఈటలను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.












Click it and Unblock the Notifications