అన్నీ ఉచితమే: ‘కంటి వెలుగు’ ప్రారంభించిన కేసీఆర్, ‘హరీశ్ రావే కాదు నేనూ మంచోడినే’
హైదరాబాద్: 'కంటి వెలుగు' లాంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా లేదని, ఇది తెలంగాణ సర్కారు మొదటి ప్రయత్నమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వృద్దులకు కంటి పరీక్షలు చాలా అవసరమని చెప్పారు.

ఒక్క రూపాయీ అవసరం లేదు
‘కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఎప్పుడూ.. ఎక్కడా చేయని ప్రయత్నం. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మందికి ఉపయోగంగా ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే చేయిస్తుంది. కంటి వైద్యం కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు
అంతేగాక, ‘ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలను తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా 825 బృందాలను నియమించాం. స్వయంగా నేనే కొందరికి కళ్లద్దాలు అందజేశాను. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోం చేసుకోవాలి' అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు.

అన్ని ఉచితమే..
కంటి వెలుగు లాంటి మంచి పథకం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పారు. కాటరాక్ట్ శస్త్ర చికిత్స కూడా పూర్తిగా ఉచితంగా చేయిస్తామని చెప్పారు.

హరీశ్, కలెక్టర్ మంచివారు.. నేను కూడా..
జిల్లాకు ఉత్సాహవంతుడైన మంత్రి హరీశ్ రావు ఉన్నారని, ఏం కావాలన్నా ఆయనే చూసుకుంటున్నారని, నిధులు కూడా రాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నారని కేసీఆర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కూడా బాగా పనిచేస్తారని ఆయన కూడా మంచివారని అన్నారు. మంత్రి, కలెక్టర్ బాగా పనిచేస్తారు.. ఇక మీ గ్రామానికి డోకా లేదని కేసీఆర్ అన్నారు. మంత్రి, కలెక్టర్లే కాదు, తాను కూడా మంచోడినేనని కేసీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణే
కొత్త రాష్ట్రంలో అన్ని సమస్యలను తీర్చాలని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే విద్యుత్, తాగునీటి కొరత తీర్చామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో త్వరలోనే మంచినీటి కొరత తీరుతుందని అన్నారు. నీటి పారుదల కోసం రూ.60వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్ చెప్పారు.

వచ్చే జూన్ నాటికి నీటి బాధలుండవు
తాను కూడా వ్యవసాయ కుటంబం నుంచి వచ్చినవాడినే కాబట్టి రైతుల కష్టాలు తెలుసని సీఎం కేసీఆర్ తెలిపారు. 15టీఎంసీల ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం ప్రపంచంలోనే రికార్డు అని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులకు ఇబ్బందులు ఎదురైనా సహకరిస్తున్నారని తెలిపారు. వచ్చే జూన్ నాటికి నీళ్ల బాధలు తెలంగాణలో ఉండవని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నీళ్లతో కళకళలాడుతాయని అన్నారు.
మల్కాపూర్పై ప్రశంసలు, వరాలు
తెలంగాణకు మాల్కాపూర్ మణిహారమని కేసీఆర్ కొనియాడారు. మల్కాపూర్ మంచి గ్రామం అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. గ్రామాన్ని చూసి తానే ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. కులాలు, మతాలు అడ్డుగోడలు లేకుండా చూడాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఆడ, మగ అనే తేడాలు ఉండకూడదని సూచించారు. మహిళలను చిన్నచూపు చూడకూదని, మద్యం మహమ్మారిని మళ్లీ గ్రామంలోకి రాకూండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మాల్కాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. మాల్కాపూర్లో ఒక్క గుడిసె కూడా లేకుండా అన్నింటినీ డబుల్ బెడ్రూం ఇళ్లను చేస్తామని కేసీఆర్ చెప్పారు. మాల్కాపూర్లో ఇంటికో రెండు పాడి పశువులను ఇస్తామని కేసీఆర్ తెలిపారు. కలెక్టర్కు రూ.6కోట్లు మంజూరు చేస్తానని, ఆయనతో చర్చించి గ్రామంలో పనులు చేయించుకోవాలని మాల్కాపూర్ ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications