రష్యా గుర్తించింది కానీ.. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలి: మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్
హైదరాబాద్: మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠేకు భారతరత్న పురస్కారాన్ని అందించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు.
మహారాష్ట్రలోని వాటేగావ్లో నిర్వహించిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాఠే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్ర గడ్డకు నా ప్రణామం. అణగారిన వర్గాల కోసం అన్నాభావు గొంతెత్తారు. సమస్యలను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వంచిత, పీడిత ప్రజల తరఫున అన్నాభావ్ నిలిచారని కేసీఆర్ అన్నారు.

'అన్నాభావు సాఠే గొప్పదనాన్ని రష్యా దేశం గుర్తించింది. కానీ మన దేశం గుర్తించలేకపోయింది. సాఠేను మన దేశం పట్టించుకోలేదు. రష్యా ప్రభుత్వం అన్నాభావ్ను అక్కడికి పిలిపించి సత్కరించింది. అన్నాభావ్ సాఠేను లోక్షాహెర్ బిరుదుతో సత్కరించారు. రష్యాలోని గ్రంథాలయాల్లో అన్నాభావ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. రష్యా కమ్యూనిస్ట్ నేత మ్యాక్సిమ్ గోర్కి నవల 'మా' ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 'మా' అనే నవల వివిధ భాషల్లో అనువాదం జరిగి ప్రతి దేశంలో అందుబాటులో ఉంది. రష్యా ప్రభుత్వం అన్నాభావ్ను భారత మ్యాక్సిమ్ గోర్కి అని ప్రశంసించింది అని కేసీఆర్ వివరించారు.
మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. pic.twitter.com/XHtZWAz2OP
— BRS Party (@BRSparty) August 1, 2023
అయితే, అన్నాభావ్ రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. అన్నాభావు సాఠే రచనల పట్ల ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆయన రచనలను ఇతర భాషల్లోకి అనువదించాలి. అన్నాభావ్ రచనలు ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు.. సార్వజనీనం. అన్నాభావ్ రచనలతో ప్రపంచానికి విజ్ఞానం లభిస్తుంది. మాతంగ్ సామాజిక వర్గానికి మహారాష్ట్ర రాజకీయాల్లో సముచిత స్థానం దక్కలేదు. మాతంగ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తరపున సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కొల్హాపూర్ చేరుకున్న సీఎంకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొల్హాపూర్ మహాలక్ష్మి స్వరూపమైన అంబబాయి అమ్మవారిని కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications