సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ జలక్ - గెలిచే సీట్లు ఎన్నంటే: వారికి కేంద్ర బెర్త్లు..!!
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తమ పట్టు నిరూపించుకొనేందకు రేవంత్ ప్రయత్నాలు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపు.. పార్టీ గెలుపు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక అంశాలు వెల్లడించారు. పార్టీ విధానపర నిర్ణయం మేరకు సిట్టింగ్ లకే తిరిగి సీట్లు కేటాయిస్తామని చెబుతూ.. కొందరికి మాత్రం పరోక్షంగా సీఎం కేసీఆర్ చురకలు అంటించారు.
హ్యాట్రిక్ కొడుతున్నాం..
పని తీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. పని తీరు మెరుగు పర్చుకోకుంటే వేరే వాళ్ల వైపు చూడక తప్పదని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 72 నుంచి 80 స్థానాలు మనమే గెలుస్తామంటూ పార్టీ నేతలతో ధీమా వ్యక్తం చేసారు. కొద్దిగా కష్టపడితే 90 నుంచి 100 సీట్లు సాధించడం ఖాయమని కేసీఆర్ వెల్లడించారు.
తాజాగా చేసిన సర్వేల్లో మునుగోడుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. కేడర్తో పొరపచ్ఛాలు రాకుండా వారితో కలసి వన భోజనాలు చేయాలని సూచించారు. దళితబంధు, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లండని నిర్దేశించారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పైన స్పందిస్తూ... తోసిపుచ్చారు.
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా
నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను దళితబంధు పథకం కింద వెంటనే ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సొంత జాగాలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా నియోజకవర్గానికి 3 వేల మంది లబ్ధిదారులను డిసెంబర్లోగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు.
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమని కేసీఆర్ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే.. పార్టీకి చెందిన నేతలకు రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులుగా అవకాశం లభిస్తుంది'అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఏర్పాటు సమయంలోనూ మీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వస్తారని చెబితే చాలామంది నమ్మలేదని గుర్తు చేసారు.
బీజేపీని రాష్ట్రంలో పట్టించుకోవటం లేదు
బీజేపీ దేశానికేం చేశామో చెప్పుకునేందుకు అంశాలేవీ లేనందునే కేవలం మత చాందసవాదాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయని కేసీఆర్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి భాగస్వామ్య పార్టీలు దూరమై ఏకాకిగా మారిందని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్పై దుమ్మెత్తిపోయడం మినహా రాష్ట్రానికి చేసేదేంటో ప్రధాని నుంచి కేంద్ర మంత్రులు వరకు చెప్పటం లేదని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతకు మించి చెప్పేందుకు బీజేపీ వద్ద ఏమీ ఉండదు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలపట్ల తొలుత రాష్ట్రంలో కొంత ఆసక్తి వ్యక్తమైనా ఇప్పుడా పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు'అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సంఘాల నేతల భేటీ తరహాలో త్వరలో జాతీయ స్థాయిలో దళిత సంఘాల ప్రతినిధులతోనూ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి'అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.