రాష్ట్రపతి సాక్షిగా కేసీఆర్-తమిళిసై విభేదాలు బట్టబయలు..!!
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్- ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి నాయకులు సైతం బాహటంగానే గవర్నర్ ను విమర్శించిన సందర్భాలు అనేకం. పలు వేదికల మీద గవర్నర్ వైఖరిని బీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టారు. భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్నారంటూ ఆరోపించారు.
కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు..!?
మరోసారి విభేదాలు..
వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతిని ప్రొటోకాల్ ప్రకారం.. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ తమిళిసైతో కలిసి స్వయంగా కేసీఆర్- రాష్ట్రపతిని నగరానికి ఆహ్వానించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర మంత్రులు ఇందులో పాల్గొన్నారు.
విందుకు గైర్హాజర్..
అక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ- ఆ తరువాతే పరిస్థితి తారుమారైంది. ద్రౌపది ముర్ము గౌరవార్థం గవర్నర్ తమిళిసై ఇచ్చిన విందుకు కేసీఆర్ గైర్హాజర్ అయ్యారు. ఇందులో పాల్గొనలేదు. సోమాజీగూడ రాజ్ భవన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనే అనుమానాలు ముందు నుంచే వ్యక్తమౌతూ వచ్చాయి. ఆయన రోజువారీ షెడ్యూల్ లో దీన్ని పొందుపర్చలేదు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు. దీనికి అనుగుణంగానే కేసీఆర్- ఈ విందుకు హాజరు కాలేదు.
వేర్వేరుగా..
ఈ వ్యవహారం తమిళిసై-కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలను మరోసారి తెర మీదికి తీసుకొచ్చినట్టయింది. ఇదివరకు గోదావరికి భారీ వరదలు సంభవించిన సమయంలో కూడా ఇది తేటతెల్లమైంది. కేసీఆర్- తమిళిసై వేర్వేరుగా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు అప్పట్లో. భద్రాచలంలో తమిళిసై, కేసీఆర్ వేర్వేరుగా వరద బాధితులను పరామర్శించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య తరచూ విభేదాలు చోటు చేసుకుంటూ వచ్చాయి.
బిల్లు సైతం..
ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసేలా కనిపిస్తోంది. గవర్నర్ ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించేలా పావులు కదుపుతున్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదివరకు కేరళ ప్రభుత్వం ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టింది.