ప్రతిపక్షాల పై కేసీఆర్ ఎన్నికల బ్రహ్మాస్త్రం..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్(BRS) ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను ప్రకటించి మేనిఫెస్టో (Manifesto)పైన కసరత్తు ప్రారంభించింది. అటు కాంగ్రెస్(Congress)..బీజేపీ(BJP) అభ్యర్దుల తుది ఖరారు పై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ సమయంలోనే హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా ప్రతిపక్షాల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బ్రహ్మస్త్రం సంధించేందుకు సిద్దమవుతున్నారు.
కేసీఆర్ కసరత్తు : తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆకాంక్ష. కర్ణాటక తరువాత తెలంగాణలోనూ తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. బీజేపీ తాము రేసులో ఉన్నామంటూ తాజాగా ప్రధాని మోదీ తెలంగాణ కు వరాలు ప్రకటించారు. ఇక, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ నిర్ణయాలకు ధీటుగా కొత్త పథకాల అమలుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమాన్ని పెంచి..మరింతగా మహిళా ఓట్ బ్యాంక్ సొంతం చేసుకొనే లక్ష్యంగా కేసీఆర్ కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు.
ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా : రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారి తుదిరూపులో గులాబీ బాస్ నిమగ్నమయ్యారు. మ్యానిఫెస్టోలో ప్రకటించే హామీలకు ఎంత ఖర్చువుతుందనే అంశాలపై సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు వర్గాలకు చెందిన నిపుణులతో చర్చిస్తూనే సాధ్యాసాధ్యాలపై లెక్కలు రెడీ చేస్తున్నారు.
ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగదు స్కీముల ప్రకటనకు కసరత్తు కొనసాగుతోందని సమాచారం. వృద్ధాప్య, వితంతు పింఛన్లను మరో రూ.1000 పెంచే అవకాశం ఉంది. రైతు పింఛన్, మహిళలకు మహిళా పింఛన్, గ్యాస్ సబ్సిడీ పెంచే దిశగా ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంచలన నిర్ణయాల దిశగా : పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్ను వాటా వ్యాట్ను కొంత సడలించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది. రైతుబంధు సాయం ఎకరానికి మరో రూ.1000 పెంచడంతోపాటు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రూ.1.25లక్షలకు పెంపు పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తమ వద్ద బ్రహ్మాండమైన పథకాలున్నాయని చెప్పిన బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నరది అన్నట్లుగా రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో కసరత్తు దాదాపు పూర్తైనట్లు సమాచారం. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పథకాల బ్రహ్మాస్త్రం ప్రయోగించి..ఇక ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications