కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు; అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్; అధికారులు అలెర్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను పదేపదే టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రేపు తెలంగాణా సీఎం మరియు మంత్రుల బృందం వెళ్లనుంది. ఇప్పటికే ఒకమారు తెలంగాణా మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించింది.
మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, అన్నారం బ్యారేజ్ లో డిజైన్ లోపాలు, పిల్లర్ కింద బుంగ ఏర్పడడం వంటి అంశాల పైన, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలు ఎత్తి చూపటం పైన ప్రధానంగా వారు ఫోకస్ పెట్టారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పరిశీలన చేయనున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రధానంగా టార్గెట్ చేయనున్నారు. కాళేశ్వరం నిర్వహణకు అవసరమైన విద్యుత్, ప్రస్తుతం అవుతున్న ఖర్చు, దీనివల్ల సాగునీరు అందుతున్న ఆయకట్టు వివరాలు అన్నింటిని చెప్పనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపధ్యంలో బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకునే విధంగా చదును పనులు చేస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ దిగువన గోదావరి తీరానికి చేరే మార్గాలను సులభతరం చేస్తున్నారు. కాళేశ్వరం వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడే నిర్మాణ లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభ నిర్వహించే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించనున్నారు. తెలంగాణ సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అలర్ట్ అయిన పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే ఐజీ శ్రీనివాస్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కరే మేడిగడ్డ బ్యారేజీ , కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు చేస్తూ కల్వర్టుల వద్ద బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక స్పెషల్ పోలీసులు అటవీ గ్రామాలను జల్లెడ పడుతున్నారు వెయ్యి మందికి పైగా పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications