మేడారం జాతర : వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. నేడు మేడారం అభివృద్ధి పనుల పైన సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. మేడారం అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆయన అన్నారు. గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు.
వారికి రేవంత్ రెడ్డి సాలిడ్ వార్నింగ్
మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు వేగంగా చేసినా శాశ్వత ప్రాతిపదికన చెయ్యాలని ఆయన ఆదేశించారు.మేడారం జాతర పనులలో ఎటువంటి తప్పులు చేయొద్దని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

జాతర పనులపై వారికి కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం
మేడారం జాతర పనులకు సంబంధిత శాఖల ఇంజనీర్లు సహా అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సందర్శించి, పనులను నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మేడారం జాతరకు రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి, రాతి స్తంభాల ఏర్పాటు, పవిత్ర వేదికల వద్ద భక్తుల రాకపోకలకు మార్గాలు, భక్తుల కోసం వేచి ఉండే ప్రదేశాల పైన సీఎం రేవంత్ రెడ్డి నిర్దిష్ట సూచనలు చేశారు.
గద్దెల వద్ద పచ్చదనంపై రేవంత్ సూచన
పనుల పురోగతిపైన అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మేడారం జాతరకు సంబంధించి చేసే పనులలో అనేక ప్రాంతాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను ముఖ్యమంత్రి ఈ క్రమంలో వారికి సూచించారు. గద్దెల చుట్టూ వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుడి చుట్టూ నాలుగువైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. గుడి చుట్టూ పచ్చదనం కనిపించేలా అభివృద్ధి చేయాలని సూచించారు. గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దన్నారు.
సమన్వయంతో అన్ని శాఖలవాళ్ళు పని చెయ్యాలన్న రేవంత్ రెడ్డి
పనులు త్వరగా పూర్తి కావడానికి ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ, ఎండోమెంట్, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications