Rythu Bandhu: రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్.. 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం..
సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు బంధు పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి కూడా వారం నుంచి పది రోజుల్లో జమ చేస్తామని వివరించారు. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా కచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
రైతు బంధు కోసం మరో రూ.3,500 కోట్లు అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేస్తామని.. ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.15 వేలు అందించనున్నారు. అంతే కాదు కౌలు రైతులకు కూడా సాయం చేయనున్నారు.

రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఆర్థికంగా ఉన్నవారికి రైతు భరోసా అవసరం లేదని చాలా మంది చెబుతున్నారు. ఇప్పటి వరకు సినీ నటులుకు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్ను చెల్లించేవారికి రైతు బంధు వచ్చేది. వీరికి రైతు భరోసా నిలిపివేయాలని డిమాండ్ ఉంది.
రైతు భరోసా ఐదు నుంచి పదేకరాల లోపు ఉన్నవారికే ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది వానాకాలంలో 68.99 లక్షల మందికి రైతుబంధు సాయం అందింది. వీరిలో ఎకరాలోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా 22.55 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలుగా ఉంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుకాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది.












Click it and Unblock the Notifications