విద్యార్థులపై వరాలు: వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్: తమ ప్రభుత్వం విద్యకు, విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున జరుపుకునే బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించింది. అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్, ప్రియదర్శిని పేరుతో ప్రత్యేక పాఠ్య పుస్తకాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ సన్నబియ్యంతో తింటున్నారో గురుకుల హాస్టళ్లలో ఉంటున్న మా బిడ్డలకు కూడా అదే అన్నం పెట్టాలని చెప్పామన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుతున్న ఆ బిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం. భావి భారత నిర్మాతలు. వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠినమైన చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

'11 నెలల పాలనలో తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన రోజు. ఈరోజును మరిచిపోలేను' అన్నారు. విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వివరించారు. విద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందుకే బడ్జెట్లో 7 శాతానికి పైగా నిధులు కేటాయించాం. గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని ఆదేశించాం. అందుకే సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొంటున్నామని సీఎం రేవంత్ వివరించారు.
నాణ్యమైన భోజనం అందించాలనే డైట్ చార్జీలను పెంచాం. అలాగే కాస్మొటిక్ చార్జీలను పెంచాం. గ్రీన్ చానెల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. బడులు తెరిచిన రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాం. 20 వేల మంది టీచర్లకు పదోన్నతులు, ఎలాంటి వివాదాలకు తావులేకుండా 35 వేల మంది టీచర్ల బదిలీలు, డీఎస్సీ ద్వారా 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ చెప్పారు.
గడిచిన దశాబ్దకాలంలో నిర్వీర్యమైన యూనివర్సిటీలకు పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో 10 వర్సిటీలకు వీసీలను నియమించడమే కాకుండా త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కులగణన వల్ల సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
ప్రజా ప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి. కలెక్టర్లు వారంలో రెండు రోజులు ప్రభుత్వ బడులను పర్యవేక్షించాలి. సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోంది. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్కు బానిసలు అవుతున్న పరిస్థితి. వ్యసనాలకు బానిసలం కాబోమని విద్యార్థులంతా నాకు మాట ఇవ్వండి. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరతామని చెప్పండి. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ముళ్ల కంచెను తొలగించి బంగారు బాట వేసే బాధ్యత తీసుకుంటా. యువతరాన్ని ప్రోత్సహించాలి. శాసనసభకు పోటీ చేయడానికి గరిష్ట వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కోరుతున్నా. గతంలో ఏ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలుపలేదు. మీతో బాలల దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషానిచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications