CM Revanth Reddy: నెల రోజుల్లో గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు పూర్తి చేస్తాం..
CM Revanth Reddy: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్లో పోస్టులకు ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ ప్రసంగించారు. సీఎం అయినప్పటి కంటే జెడ్పీటీసీ అయినప్పుడే తాను ఎక్కువ సంతోష పడ్డానన్నారు. కారుణ్య నియామకాలు మీ హక్కు అని.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జాబ్ క్యాలెండర్ తో పాటు కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రజాప్రభుత్వం గుర్తించిందని.. అందుకే ఏడాదిలోనే 59వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని.. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టింది.. ఎన్ని పరీక్షలను సజావుగా నిర్వహించిందని ఆయన ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 10 నెలల్లో తాము చేసిన పనులను.. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ నోటిఫికేషన్లు అన్నీ మేము ఇచ్చినవే అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబంలో వారిని ప్రజలు తిరస్కరిస్తే.. 6 నెలల్లోనే వేరే పదవులను కేసీఆర్ ఇచ్చారన్నారు. యంగ్ ఇండియా యూనివర్సిటీని దేశానికి ఆదర్శంగా తీసుకువచ్చామన్నారు.

నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని.. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ఉద్యోగ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని.. ఆదేశాలిచ్చామని.. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చామన్నారు. 30,40 రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాలను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. గతంలో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి వెనకాల నుంచి కోర్టులో కేసులు వేయించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భూమి చెరువులో ఉందా.. నాలాలో ఉందా అని తెలియదని.. ఇప్పుడు ఎంత పెద్దవారైనా.. బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. పారదర్శక పాలన ఇవ్వాలని ఇవన్నీ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications