టచ్ చేస్తే వీపు చింతపండే - రేవంత్ మాస్ వార్నింగ్..!!
ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నేతలు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ జయంతి వేళ ఆయన విగ్రహం ఏర్పాటు పైన బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పైన సీరియస్ గా స్పందించారు. రాజీవ్ కు నివాళి అర్పించిన రేవంత్ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని వ్యాఖ్యానించారు. రాజీవ్ విగ్రహం ఎప్పుడు ముడతారో చెబితే జగ్గన్నను పంపిస్తామని హెచ్చరించారు.
రేవంత్ సవాల్
ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండని రేవంత్ సవాల్ చేసారు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదని పేర్కొన్నారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పారు. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని మండిపడ్డారు. వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు. వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారన్నారు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు.. విగ్రహాన్ని పెట్టేదెప్పుడని రేవంత్ వ్యాఖ్యానించారు.

అధికారం రాదు
ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారని రేవంత్ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నారని..మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితమని రేవంత్ జోస్యం చెప్పారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని రేవంత్ హామీ ఇచ్చారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని హెచ్చరించారు.
గుర్తు రాలేదా
కలలో కూడా వీళ్లకు అధికారం రాదన్నారు. పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా రేవంత్ పేర్కొన్నారు. విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అన్నారు. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీనేని చెప్పుకొచ్చారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని రేవంత్ నివాళి అర్పించారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారని రేవంత్ కొనియాడారు.












Click it and Unblock the Notifications