1,000 రోజుల్లో కేసీఆర్ కు రూ. 22.24 కోట్లు ఇచ్చాం : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 1000 రోజుల్లో రూ.1,24,40,000 జీతం తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 'నేను.. నా ముసల్ది'' అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని రంగంలోకి దించి రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారని.. ఇప్పటికీ తింటున్నారని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయింది.. ఇన్నిరోజులు కేసీఆర్ విధులకు హాజరుకాకుండానే ఏకంగా రూ.12400000 జీతం తీసుకున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం రూ. 21 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే మొత్తంగా రూ. 22.24 కోట్ల ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన కేసీఆర్ ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా..? ఎక్కడైనా ప్రభుత్వాల వైఫల్యం చూశాం. కానీ ఇక్కడ విపక్షం వైఫల్యం చెందినందున ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలి' అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుండి 6 వరకు అంటే ఈ వారమంతా కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.
అలాగే మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ రాజీనామా చేసేవరకు ఉద్యమించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబర్పేట- ముసారాంబాగ్ మధ్య మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ కు నిజంగా తెలంగాణపై గౌరవం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన అలాగే తమ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్దమా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
రూ.22 కోట్ల ప్రజల సొమ్ము తిన్న కేసీఆర్ ఏ ఒక్క రోజూ కూడా ప్రజల కోసం బయటికి రాలేదు. కానీ ఆయన బంధువులు చనిపోతే వెళ్తారు. మనవడి కోసం ఆస్పత్రికి వెళ్తారు. కానీ ప్రజల కోసం ఏనాడు బయటికి రాలేదు. అంతకు ముందు సీఎంగా కేసీఆర్, ఆయన కుటుంబం వేల కోట్లు తిన్నారు. అసెంబ్లీకి రాని, ప్రజలను కలవని ఎమ్మెల్యేకు ప్రభుత్వ సొమ్ము తినే అర్హత ఉందా..?. వెయ్యి రోజులుగా ఫామ్హౌస్లోనే ఉన్న వ్యక్తికి జీతభత్యాలు అవసరమా..? అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అలాగే తనకు.. కేసీఆర్ కు అసలు పోలిక లేదని.. కేసీఆర్ తన కుటుంబాన్ని పదవుల్లో కూర్చోబెడితే.. తాను సామాన్య కార్యకర్తలను, బలహీన వర్గాల బిడ్డలను మంత్రులుగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీలుగా చేశానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక త్వరలో ఎల్ బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వివిధ ఆస్పత్రులకు కొండా లక్ష్మణ్, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహనీయుల పేర్లు పెడుతున్నామని వివరించారు. సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని.. నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా చేసి సామాజిక న్యాయం పాటించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు టచ్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.

కేసీఆర్ కుటుంబం ప్రజల ధనాన్ని లూటీ చేసి వేయి ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు నిర్మించుకుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ 100 ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని మండిపడ్డారు. కవిత కూడా 50 ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ లు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటోందని వివరించారు. ప్రజాధనాన్ని ప్రజలకే ఖర్చు చేస్తోందని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లో పేదల ఆత్మగౌరవం కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 3,500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications