సాంబార్లో బొద్దింక-హైదరాబాద్ ఫేమస్ హోటల్ పై కస్టమర్ ఫిర్యాదు..!
హైదరాబాద్ లో హోటల్స్ లో ఆహారం పరిస్ధితి ఎలా ఉందో నిరూపించే మరో ఘటన ఇవాళ చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత యథావిథిగా హోటళ్లలో తినేందుకు వెళ్తున్న ఆహార ప్రియులకు గట్టి షాక్ తగిలింది. ఓ హోటల్లో వడ్డించిన సాంబార్ లో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ హోటల్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఏదో సర్ది చెప్పబోతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్లో తాను వెళ్లినప్పుడు ఎదురైన ఈ చేదు అనుభవంపై హైదరాబాద్ కు చెందిన రాణా అనే కస్టమర్ ఇవాళ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తాను హోటల్కి వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ని ఆర్డర్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. సిబ్బంది తెచ్చిన సాంబార్ డిష్లో పురుగులు కనిపించాయని ఆరోపించాడు. దీంతో సదరు హోటల్ లో పరిస్ధితులు ఎలా ఉన్నాయో వివరిస్తూ ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు.

తన ఫిర్యాదును అత్యవసరంగా విచారించి, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా హోటల్పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదులో కోరాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కూడా అధికారుల్ని కోరుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రజారోగ్యం, భద్రత ప్రమాదంలో ఉన్నందున, దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా బాధితుడు కోరాడు. ఇప్పటికే జంట నగరాల్లోని పలు ప్రముఖ హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు లోపాలు గుర్తిస్తున్న అధికారులు.. ఈ హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications