మరో కీలక వికెట్ డౌన్: టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత, హామీ ఇచ్చిన నేతలు
హైదరాబాద్: మాజీ కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ అనిల్ జాదవ్ అధికార తెరాసలో చేరేందుకు రంగం సిధ్దమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 20న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెరాస ముఖ్య నేతల ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పని చేసేందుకు అనిల్ జాదవ్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నగేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే బాపురావు, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీలో సముచితం స్థానం కల్పిస్తామని అనిల్ జాదవ్కు హామీ లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో తెరాసలో చేరాలని అనిల్ జాదవ్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న అనిల్ జాదవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో ఓడిపోయారు.