వైఎస్సార్ తరహాలో- తెలంగాణలో కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ..!!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ చేస్తోన్న దాడిని తిప్పికొట్టేలా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి.. 60 సంవత్సరాల్లో తెలంగాణలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయడానికి వినూత్న పంథాను ఎంచుకుంది. కొత్తగా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులతో సెల్ఫీ దిగి.. వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై పోస్ట్ చేయడం ద్వారా వాటి గురించి ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా పాల్గొంటారు. వారందరినీ భాగస్వామ్యులను చేశారు. వాట్సాప్ డీపీల్లో ఆ ఫోటోలు పెట్టుకుని విస్తృత ప్రచారం చేస్తారు.ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క్, మధుయాష్కి గౌడ్, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేస్తోన్న ఫొటోతో వారంతా సెల్ఫీ దిగారు. అనంతరం వారు విలేెకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ను తీసుకొచ్చింది తామేనంటూ బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారాన్ని తిప్పి కొడతామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత కరెంట్ ఫైల్పై వైఎస్సార్ తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేయని రోజుల్లోనే అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్సార్, కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మన్గా చక్రపాణి ఉచిత విద్యుత్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారని అన్నారు.

వ్యవసాయం, నీటిపారుదల అనే అంశం కింద రైతులకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 రోజుల్లో పరిష్కారిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కొత్త దరఖాస్తులను 30 రోజులలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను యంత్రాలను ప్రవేశపెట్టడం, యంత్రాల నిర్వహణలో రైతుకు తగిన శిక్షణ ఇవ్వడం, వారి పనిముట్లను మెరుగుపరచడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పంట మార్పులపై ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వడం,
మేలు రకం విత్తనాలు, పురుగు మందులు సమకూర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కల్తీదారులను కఠినంగా శిక్షించడం తదితర అంశాలను అప్పటి మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు.
ఉచిత కరెంట్కు 1999 నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ దీన్నీ కొనసాగించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన పవర్ ప్రాజెక్టు కంటిన్యూ చేయడం వల్లనే ఇప్పుడు విద్యుత్ కోతలు లేవని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి సొమ్ముతో ప్రచార ఆర్భాటం చేస్తూ.. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Remembering Congress legacy… when Shri. Y.S. Rajshekhar Reddy launched the historic free electricity for farmers scheme with his first signature as the Chief Minister.
— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) July 25, 2023
Free power is our patent right and Congress will ensure free 24/7 electricity to farmers.@TelanganaCMO… pic.twitter.com/dAaw3d2lbE
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అవసరాలు ఉంటాయని, ఆ రాష్ట్ర అవసరాలు ఆదాయ వనరులను బట్టి మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఉచిత కరెంట్ను చత్తీస్గఢ్లో ఎందుకు ఇవ్వట్లేదనడం పిచ్చి ముదిరి మాట్లాడినట్టుగా ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్లో మెట్రో రైలు తామే తెచ్చామని.. మెట్రో ఎక్కి సెల్ఫీ తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, మెట్రో చార్జీల పెంపుదలపై ప్రజల్లోకి వెళతామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఈసీఐఎల్, బీహెచ్ఇఎల్, బీడీఎల్, మంచినీటి సరఫరా.. ఇలా ప్రతి అభివృద్ధిని సెల్ఫీ విత్ కాంగ్రెస్తో ప్రజల ముందుకు తీసుకు వెళతామని అన్నారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అసమర్ధ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా తెలుసుకొని తెలంగాణను రక్షించడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారని మధుయాష్కీ గౌడ్ ప్రశంసించారు. ఉచిత విద్యుత్ను తీసుకురావడంలో వైఎస్సార్తో అవినాభావ సంబంధం ఉన్న భట్టి విక్రమార్క ప్రమేయం కూడా ఉందని వివరించారు.
16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పాటైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్దేనంటూ మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యవసాయం, రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించారని, అదే పార్టీ విధానమని అన్నారు.
తమ ప్రభుత్వం నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్షల ఎకరాల సశ్యశ్యామలం చేసిందని మధు యాష్కీ అన్నారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్లో ప్రాజెక్టు వద్ద సంబరాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రావిటీ ద్వారా దిగువకు నీళ్లు వచ్చే విధంగా రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications