సుష్మా కాళ్లు పట్టుకున్నారు: ఉండవల్లి పుస్తకంపై జైపాల్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని సంగతి తెలిసిందే. అయితే ఉండవల్లి పుస్తకం చదివిన ఏపీ ప్రజలు ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పేరుని ప్రస్తావించనంతగా విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం గురించి క్లుప్తంగా ఆయన తన పుస్తకంలో రాశారు.
ఈ నేపథ్యంలో ఉండవల్లి పుస్తకంపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఉండవల్లి పుస్తకంపై స్పందించారు. ఉండవల్లి తన పుస్తకంలో ఊహా జనితాలు రాశారని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ చాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి కట్టుకథ రాశారని తెలిపారు.
తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారని, నిబంధనల ప్రకారమే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. సభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆపాలని తాను సలహా ఇవ్వలేదని, పెప్పర్ స్ర్పే కొట్టినందునే ప్రసారాలు నిలిపివేసి ఉంటారని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో పేర్కొన్న అంశాలపై క్లారిటీ ఇవ్వదలిచామన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి ఏం మాట్లాడారంటే....
ఉండవల్లి తన పుస్తకంలో నా గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే స్పీకర్ ఛాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి ఉహాజనిత కట్టుకథ రాశారు. అర్ధం,ఆధారం లేకుండా ఊహించి ఎలా రాస్తారు?. తెలంగాణా వచ్చిందనే నైరాశ్యం,నిస్పృహలో ఇలా కొంత కట్టుకథ రాసారు. రాష్ట్ర విభజనలో తెలంగాణా ఎంపీలు, జైపాల్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందని ఉండవల్లి రాశారు.
అవును అప్పుడు మేము నిర్ణయాత్మక పాత్ర పోషించాం. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ లో పొన్నం ప్రభాకర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సుస్మా స్వరాజ్ ను ప్రాధేయ పడ్డారు. దాంతో ఆమె స్పీకర్ ఛాంబర్కు వచ్చి నాతో చర్చించారు. స్పీకర్ ఛాంబర్లో ఆనాడు ఏం జరిగిందో మాకు తెలుసు. సాక్షులము మేమే. బిల్లు పెడితే ఫ్లోర్ లీడర్గా తాను మద్దతు ఇస్తా అని సుష్మాా చెప్పారు.
స్పీకర్ ఛాంబర్ లో సుష్మాా స్వరాజ్ కు, మాకు ఒక ఒప్పందం జరిగింది. హౌస్ ఆర్డర్ లో లేనందున బిల్లు ఎలా పెట్టాలని స్పీకర్ అడిగితే.. స్పీకర్కు నచ్చజెప్పింది నేనే. హౌస్లో సభ్యుల మెజారిటీ ఉన్నందున బిల్లు పెట్టమని స్పీకర్ ను కోరాం. ఓటింగ్ జరిపే పరిస్థితి లేనప్పుడు.. సభ్యులు కూర్చున్న చోటు నుంచే నిలబడి అభిప్రాయాలు చెప్పే రూల్ ఉంది.
బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు సుష్మా ఇతర బీజేపీ సభ్యులు, ఎల్ కే అద్వానీ కూడా స్వయంగా లేచారు. బిల్లు ప్రవేశపెట్టిన రోజున స్పీకర్ ఛాంబర్ లో ఏం జరిగిందో ఉండవల్లి కి తెలియవు. ఉహించి రాయటానికి ఆయనకేమన్నా దివ్య దృష్టి ఉందా. కథలు చెప్తే సుష్మా ఎందుకు వింటారు.
కథ సాక్షిగా ఉండాలి తప్ప ఊహకు అందకుండా కట్టు కథ రాస్తే ఎలా. బిల్లు రాజ్యాంగ సమ్మతంగా లోకసభ లో ఆమోదం పొందింది, నిబంధనల మేరకే బిల్లు ఆమోదం పొందింది. దీనిపై సుప్రీంకోర్టు లో ఉన్న కేసును గెలుస్తాం. బిల్లు సంబంధించి సుప్రీంకోర్టు లో కేసు ఇంకా పెండింగ్ ఉంది. కేసీఆర్కు కూడా స్పీకర్ చాంబర్లో ఏం జరిగిందో తెలియదు.
హౌస్లో స్పీకర్ ప్రకటన చేసే వరకు అందరిలో బిల్లు పై ప్రతిష్టంభన ఉంది. కుట్ర, కుతంత్రం అని రాశారు. తెలంగాణాకు సీఎం ఎవరు అవుతారనేది ప్రధానం కాదు. తెలంగాణా రావటం ముఖ్యం అని భావించాం. పొన్నం ప్రభాకర్ సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నారు. దీన్ని కూడా ఉండవల్లి వ్యంగ్యగా రాసారు. హౌస్ ప్రసారాల్ని ఆపమని నేను సలహా చెప్పలేదు.
ప్రసారాలు నిలిపి వేయటానికి బిల్లు ఆమోదింపజేయటానికి ఎలాంటి సంబంధం లేదు. బహుశా పెప్పర్ స్ప్రే కొట్టినందున ప్రసారాలు నిలిపివేసి ఉంటారని భావిస్తున్నాను.' అని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి 'విభజన కథ నా డైరీలో కొన్ని పేజీలు' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.