సోనియమ్మా క్షమించు, పోటీ నుంచి తప్పుకుంటున్నా: సిరిసిల్ల రాజయ్య
వరంగల్: తమ పార్టీ వరంగల్ లోకసభ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెసు అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే, స్వయంగా తానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సిరిసిల్ల రాజయ్య చెప్పారు. సోనియా క్షమించు, పోటీ నుంచి తప్పుకుంటున్నా అని ఆయన అన్నారు.
నామినేషన్ దాఖలుకు బుధవారమే చివరి తేదీ. రాజయ్య గతంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరిపై ఓటమి పాలయ్యారు. వరంగల్ లోకసభ స్థానం కాంగ్రెసు టికెట్ కోసం సర్వే సత్యనారాయణ వంటి పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ స్థానికుడు అనే కారణంతో రాజయ్యనే అభ్యర్థిగా కాంగ్రెసు అధిష్టానం ఎంపిక చేసింది.
సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు నాయకులు పార్టీ అధిష్టానం పెద్దలకు వివరిస్తున్నారు. రెండు రోజుల క్రితం సిరిసిల్ల రాజయ్య డమ్మీ అభ్యర్థిగా లోకసభ స్థానానికి నామినేషన్ వేశారు. బుధవారం కాంగ్రెసు అధికారిక అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సి ఉంది.
రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు పిల్లలు ఇంట్లో సజీవ దహనం కావడం రాజకీయంగా ఆయనకే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా తీవ్రమైన ఎదురుదెబ్బనే.