కాంగ్రెస్ సునామీ, ఏకపక్ష విజయం - బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..!!
తెలంగాణలో కాంగ్రెస్ మ్యాజిక్ చేసింది. మేజిక్ ఫిగర్ కు చేరువ అయింది. అధికారం దాదాపు ఖాయమైంది. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగా కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తోంది. బీఆర్ఎస్ నామ మాత్రపు పోటీ ఇస్తున్నట్లు తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అంచనాలకు దూరంగా ఉంది. కౌంటింగ్ ఇంకా జరగాల్సి ఉన్నా. ట్రెండ్స్ మాత్రం కాంగ్రెస్ కు ఏకపక్షంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కంచుకోటల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఏకపక్షంగా దూసుకెళ్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలను కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కనీస అంచనాలను అందుకోలేక పోతోంది. ఊహించని విధంగా మంత్రులు..ప్రముఖులు వెనుకబడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కంచుకోటలుగా మలచుకున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో హస్తం దూసుకెళ్తోంది. కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో మాత్రం అధిక స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావాల్సిన 60 స్థానాలు కాంగ్రెస్ కు సులువుగా దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ నేతలు చివరి వరకు ధీమా వ్యక్తం చేసినా..ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల్లో మాత్రం ఆ దిశగా కనిపించటం లేదు. ఇంకా చాలా రౌండ్లు కౌంట్ చేయాల్సి ఉన్నా..తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ వేవ్ క్లియర్ గా ఉంది. దీంతో..ప్రభుత్వంలోని పలువురు మంత్రులు..పార్టీ ముఖ్యులు వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో దయాకర్ రావు వెనుకంజలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి పైన కాంగ్రెస్ అభ్యర్ది ఆధిక్యత కొనసాగుతోంది. ఖమ్మంలో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ మాత్రం భారీ మెజార్టీ దిశగా కొనసాగుతున్నారు.
బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్లు తెలుస్తోంది. తరువాతి రౌండ్లలో అనూహ్య మార్పు వస్తే మినహా బీఆర్ఎస్ కోలుకోవటం కష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతున్న సీట్ల కంటే రెట్టింపు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ 54 స్థానాల్లో, బీఆర్ఎస్ 21 స్థానాల్లో, బీజేపీ 6, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. తొలి రౌండ్ లో పలువురు మంత్రులు వెనుకబడి ఉండటం బీఆర్ఎస్ లో కలవరానికి కారణమవుతోంది. తుది ఫలితాలు ఏంటనేది దాదాపు ఈ ట్రెండ్స్ ద్వారా స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications