రగులుతున్న కోమటోళ్లు: కంచ ఐలయ్యకు హరీష్ రావు హెచ్చరిక
ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంపై వివాదం రగులుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన పుస్తకంపై కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. తెలగాణ మంత్రి హరీష్ రావు కంచ ఐలయ్యకు
హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంపై వివాదం రగులుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన పుస్తకంపై కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. తెలగాణ మంత్రి హరీష్ రావు కంచ ఐలయ్యకు హెచ్చరిక చేశారు.
సామాజిక మాధ్యమాల్లో కూడా వివాదం రగులుతూనే ఉంది. ఐలయ్యను బలపరిచేవారు, వ్యతిరేకించేవారు పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. కంచ ఐలయ్య పుస్తకానికి కౌంటర్ పుస్తకం కూడా విడుదలైంది.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకం సమంజసంగా లేదన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని తమ మనోభావాలను దెబ్బతిన్నాయని వైశ్యులు వినతిపత్రం ఇచ్చారని ఆయన తెలిపారు.
ఏ మేధావి కూడా ఆంగీకరించడు...
ప్రభుత్వం తరఫున ఐలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఒక కులాన్ని దూషించడం అనేది ఇది ఏ ఒక్కరికి తగదని, ఏ మేధావి కూడా ఐలయ్య వ్యాఖ్యలను, పుస్తకాలను ఆమోదించడని ఆయన అన్నారు. కులాన్ని బట్టి గుణాన్ని నిర్ణయించలేమమని, ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే వారికే మంచిదని మంత్రి అన్నారు.
కౌంటర్ పుస్తకం...
సామాజిక సేవకులు వైశ్యులు' పుస్తకావిష్కరణ కార్యక్రమంహైదరాబాద్లో జరిగింది. ఐలయ్య పుస్తకానికి కౌంటర్గా 'సామాజిక సేవకులు వైశ్యులు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. కంచె ఐలయ్య కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. కంచె ఐలయ్యను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె ఐలయ్య దేశద్రోహి..విదేశీ ఏజెంటు అని ఆయన అన్నారు. ఐలయ్య దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కంచె ఐలయ్యపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు.
కంచ ఐలయ్య దేశద్రోహి...
లక్ష కోట్లు ఇస్తే ఏదైనా చేస్తానన్న కంచె ఐలయ్య లాంటి దేశద్రోహలను ప్రోత్సహించరాదని కాకినాడ శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద స్వామి సూచించారు. దేవీనవరాత్రుల అనంతరం కీలక కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కార్యాచరణ వెనక హైందవ పెద్దల ఆలోచన ఉందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనతోపాటు హిందువులు కలిసి రాకపోతే.. ధార్మిక జనజీవనస్రవంతి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. గురు స్థానంలో ఉండి ఐలయ్య అభ్యంతరకంగా మాట్లాడం దారుణమని అన్నారు. దళితులను మతం మార్చి రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. కులాలు, జాతుల మధ్య కంచె ఐలయ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపసంహరించుకోవాలి...
కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అని కంచె ఐలయ్య పుస్తకం రాయడం సరైంది కాదని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలేశ్వరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పదానికి అర్థం తెలియకనే ఆయన అలా రాసి ఉండొచ్చని అన్నారు. హిందూ దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి రచనలు చేయడం తగదని ఆయన అన్నారు. కోమటోళ్లు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని సమాజసేవకు ఖర్చు పెడుతున్నారని కపిలేశ్వరయ్య తెలిపారు. క్రైస్తవులు, ముస్లింలు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, వ్యాపారాన్ని ఒక కులానికి అపాదించడం మంచిది కాదని ఆయన అన్నారు.