తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం.. 500 మందికిపైగా పాజిటివ్..
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పోలీస్శాఖలోనూ ఈ వైరస్ కలవరపెడుతోంది. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 500 మందికిపైగా పోలీసులకు పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించిన పోలీసులు కరోనా బారిన పడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
పోలీస్ శాఖలో 500 మందికి పాజిటివ్
పోలీస్ శాఖలో సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడంతో మిగిలిన సిబ్బంది విధులను నిర్వర్తించాలంటే భయపడుతున్నారు. జీహెచ్ఎంసీలోని మూడు కమిషనరేట్ పరిధిలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్లో ఆంక్షలు విధించారు. పోలీస్ స్టేషన్కు ఒక్క ఫిర్యాదుదారుడు మాత్రమే రావాలని సూచించారు. పోలీస్ శాఖలో 90 శాతం మేరకు వ్యాక్సినేషన్ రెండో డోసు కూడా పూర్తయింది. వారందరికి బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు. హోమ్ గార్డ్ మొదలు ఐపీఎస్ అధికారి వరకు అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాజేంద్రనగర్ పీఎస్లో 16 మందికి పాజిటివ్
యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా బారిన పడ్డారు .
అటు రాజేంద్రనగర్ పీఎస్లో ఏకంగా 16 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక ఎస్ఐ, ఎఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా తేలింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లుకు, పేట్బషీరాబాద్, దుండిగల్ పిఎస్లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు.
వీళ్లంతా హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అటు జిల్లాల్లోనూ పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు.
తెలంగాణ కరోనా విలయం
తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 2,047 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 1174 కేసులు నమోదు అయ్యాయి.
కేబినెట్ లో కీలక నిర్ణయాలు..
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. పలు ఆంక్షలకు సంబంధించిన నివేదికను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే సీఎంవోకి అందజేసింది. నైట్ కర్ఫ్యూను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేసే అవకాశం ఉంది. ఆఫీసుల్లో, సినిమా హాళ్లులో 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించేలా చర్యలకు ఆదేశించే సూచనలు ఉన్నాయి. కరోనా కేసుల తీవ్రతను బట్టి మరిన్ని ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుంది.