సీఎం కేసీఆర్ పై కేంద్రం డేగ కన్ను - జైలుకు వెళ్ళటం ఖాయమన్న బండి సంజయ్ - సొంత క్యాడర్కూ వార్నింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్యం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలను కేసీఆర్ భ్రష్టుపట్టించారని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్రం డేగ కన్ను వేసిందని, చేసిన తప్పులకు కేసీఆర్ అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. మరోవైపు సొంత పార్టీలోని నేతలకూ సంజయ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఆస్పత్రుల్లో అవినీతి ఓ తునక..
కరోనా మహమ్మారిని నియంత్రించే విషయంలోగానీ, కొవిడ్ రోగులకు చికిత్స విషయంలోగానీ తెలంగాణ సర్కారు దారుణంగా ఫెయిలైందని బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్ సహా అన్ని చోట్లా కార్పొరేట్ ఆస్పత్రులు.. కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో అక్రమంగా బిల్లులు వసూళ్లు చేస్తున్నా కేసీఆర్ చోద్యం చూస్తున్నారని, అసలైన దొంగలను వదిలేసి, ఏవో కొన్ని ఆస్పత్రులపై తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టారని, కేసీఆర్ అవినీతిలో ఆస్పత్రుల వ్యవహారం ఒక మచ్చుతునక మాత్రమేనని బీజేపీ చీఫ్ అన్నారు.

హిందూ వ్యతిరేక విధానాలు..
ఒక మతానికి కొమ్ముకాస్తూ, కేసీఆర్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని, పండుగల సందర్భంలో వెలువడిన ఆదేశాలు, కరోనా కేసుల తీరును చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని సంజయ్ ఆరోపించారు. ‘‘రంజాన్ సమయంలో హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చేసి చూపించారు. అదే గణేశ్ నవరాత్రి పండుగ దగ్గరికి వచ్చేసరికి కరోనా వ్యాప్తి పెరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు''అని మండిపడ్డారు.

అన్ని వర్గాలకూ అన్యాయం..
కేసీఆర్ విధానాల వల్లే రాష్ట్రంలో అవినీతిపెరిగిందన్న బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాలనూ దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇటు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను సైతం ప్రభుత్వం విస్మరించిందని, ఎన్నికల సమయంలో పీఆర్సీపై ఇచ్చిన హామీని కేసీఆర్ గాలికొదిలేశారని, సింగరేణి ఎన్నికల సమయంలోనూ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ఫెయిలయ్యారని బీజేపీ చీఫ్ మండిపడ్డారు. కనీసం ఇప్పటికైనా ఆయా వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే,
Recommended Video

బీజేపీ శ్రేణులకు సంజయ్ వార్నింగ్
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా ఉపేక్షించబోమని, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నడుచుకోవాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం వెబినార్ ద్వారా బీజేపీ నూత పదాధికారుల తొలి సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ కేంద్రం జరిపే సమీక్షల్లో ఒకలా, బయట మరోలా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై కేంద్రం నజర్ పెట్టింది. 2023లో బీజేపీనే అధికారంలోకి రాబోతున్నది. ఆ దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి''అని శ్రేణులకు సంజయ్ ఉద్భోద చేశారు.












Click it and Unblock the Notifications