గవర్నర్ 'కేసీఆర్' భజన పదవిని పొడగించుకోవడానికే..: షబ్బీర్ అలీ
గవర్నర్ తన పదవిని పొడగించుకునేందుకే కేసీఆర్ భజన చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలో గడిచిన 31నెలల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి గూర్చి ప్రస్తావిస్తూ గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యలపై స్పందించారు.

సోమవారం నాడు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వైఖరిని తప్పుబట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ తన పదవిని పొడగించుకునేందుకే కేసీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను డైనమిక్ లీడర్ అంటూ పొగడిన గవర్నర్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్ లో డైనమిజం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనియాదవ్ ను మంత్రిగా ప్రమాణం చేయించడం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గవర్నర్ నీరుగార్చారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కేవలం తన పదవీకాలాన్ని పొడగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే గవర్నర్ కేసీఆర్ భజన మొదలుపెట్టారని విమర్శించారు.












Click it and Unblock the Notifications