కౌంట్ డౌన్ స్టార్ట్: మరికొన్ని గంటల్లో హైదరాబాద్కు ఇవాంకా, హై అలర్ట్, ప్రధాని సుడిగాలి పర్యటన...
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ భాగ్యనగారానికి చేరుకోనున్నారు.
Recommended Video
హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ భాగ్యనగారానికి చేరుకోనున్నారు.
ఇవాంకా టూర్: హైదరాబాద్లో రెండ్రోజులు, అధికారిక షెడ్యూల్ ఇదే..
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు మంగళవారం భాగ్యనగరానికి చేరుకోనున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో సోమవారమే హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్లో హై అలర్ట్...
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్) 2017 నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సదస్సుకు భద్రత విషయాన్ని పోలీసు యంత్రంగం ఒక సవాలుగా తీసుకుంది.
ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపు...
మియాపూర్, కూకట్పల్లి, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గాల్లో మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మియాపూర్తో పాటు కూకట్పల్లిలోని పలు విద్యా సంస్థలు మంగళవారం తమ విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించాయి. వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, తాజ్ ఫలక్నుమా చుట్టుపక్కల ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ఘట్టాలు కావడంతో అనుకోని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ప్రధాని సుడిగాలి పర్యటన...
ప్రధానమంత్రి మోడీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైల్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెచ్ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్నుమాలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని తిరిగి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరిగి వెళతారు. ఇవాంకా ట్రంప్ మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా పర్యటన మొత్తం హెలీకాఫ్టర్లోనే జరుగుతుంది.
మూడు రోజులు.. మూడు విందులు...
ఈ మూడు రోజుల్లో మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజ్ ఫలక్నుమాలో, రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో విందులు ఏర్పాటు చేశాయి. ఫలక్నుమా ప్యాలెస్ లో ఈ నెల 28న ప్రధాని ఇచ్చే విందు జరగనుండగా, 29న గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం విందునివ్వనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వమిచ్చే విందుకు మోడీ, ఇవాంకా హాజరుకావడం లేదు.
సదస్సు నిర్వహణకు రూ.8 కోట్లు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొననున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ సదస్సు నిర్వహణ, అతిథుల బస, భోజనాలు, ట్రాన్స్ పోర్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఫలక్నుమా, గోల్కండ కోట విందు ఖర్చులు అదనం. ఇదే కాకుండా విదేశీ అతిథులు ఉండేందుకు 287 గదులున్న నోవోటెల్ హోటల్ ను బుక్ చేశారు. అలాగే హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ లోని వెస్టిన్ హోటల్, రహేజా ఐటి పార్క్ లను కూడా రిజర్వు చేశారని తెలుస్తోంది. ఇక నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా రోడ్లు వేసేందుకు అయిన మొత్తం ఈ ఖర్చుకు అదనం.
పూర్తయిన కాన్వాయ్ ట్రయల్రన్...
మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్ఐసీసీలో జరగనున్న జీఈఎస్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్ పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్లో చేరుకోనున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ ట్రయల్రన్ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్లో పాల్గొన్నాయి. ఇప్పటికే వేదికలతో పాటు వాటికి దారి తీసే మార్గాల్లో ఉన్న చిరు వ్యాపారులను తొలగించారు. కాన్వాయ్లు, అతిథుల వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.