కరోనా పేషెంట్ల ప్రాణాలకు ముప్పు ఇలానే వస్తోంది..ఏంటా ముప్పు ,ఎలా జయించాలి..?
హైదరాబాదు: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. అయితే ఈ సారి ఈ మహమ్మారికి ఎక్కువగా బలవుతున్నది మాత్రం యువతే. ఇక మొత్తంగా కరోనా అంటేనే జనం జంకుతున్నారు. ఒక్కసారి వచ్చి అది తీవ్రంగా మారిందో పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నారు. ఇక కరోనా సోకిన వారు చాలా మంది ముందుగా ఆందోళనకు గురవుతున్నారని దీంతో వారిలో ఉన్న కొన్ని హెల్త్ పారామీటర్స్ పడిపోతున్నట్లు వైద్యులు గమనించారు. అంతకంటే ముందు కోవిడ్ పేషెంట్లు ఐసొలేషన్ను తలుచుకుని ఆందోళన చెందుతున్నట్లు వైద్యులు చెప్పారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకిందన్న వార్త తెలుసుకుని మరింత కృంగిపోవడంతో ఒక్కింత డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అంటే వారి మానసిక పరిస్థితి కూడా బలహీనపడుతోందని దీని ద్వారా అదనంగా రోగాలను కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

డిప్రెషన్ ఆరోగ్యానికి మరింత హానికరం
కుటుంబంలోని సభ్యులకు గానీ, అతి దగ్గర బంధువులకు గానీ కరోనా సోకిందన్న వార్త లేదా కరోనాతో మృతి చెందారన్న వార్త వినగానే ఇంట్లో వారు డిప్రెషన్కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో వారు కోవిడ్ బారిన పడితే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకరికి కరోనా సోకి మరణిస్తే ఆ ఆలోచనలతో మానసికంగా కృంగిపోతున్నారని... అలాంటి ఆలోచనల నుంచి పక్కకు రావాలని సూచిస్తున్నారు. ఇందుకోసం రోజు వ్యాయామం చేయడం, ఎంటర్టెయిన్మెంట్ ప్రోగ్రాం చూడటం, ఇతర రిలాక్సేషన్ చర్యలు తీసుకుంటే మానసికంగా కూడా ఆరోగ్యంతో ఉంటామని వైద్యులు చెబుతున్నారు.

హోంక్వారంటైన్లో వ్యక్తులను పర్యవేక్షిస్తుండాలి
హోం క్వారంటైన్లో ఉంటున్న వారు మానసికంగా బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరో సైకియాట్రిస్ట్ సూచిస్తున్నారు. హోంక్వారంటైన్లో ఉంటున్న వారి మానసిక పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని చెప్పారు. ఒకవేళ వ్యక్తి అసాధారణంగా ప్రవర్తించినట్లు కనిపించడం, భ్రాంతి కలిగి ఉండటం, హైపోక్సియా వంటివి గమనిస్తే వెంటనే హాస్పిటల్లో చేర్చాలని చెబుతున్నారు. అలా ఆందోళన చెందుతున్న పేషెంట్లకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, వారితో కొన్ని వ్యాయామాలు చేయించి, తక్కువ డోసుతో ఉండే మందులు ఇవ్వడం వల్ల ఆరోగ్యంకు ఆందోళనతో కలిగే నష్టాన్ని కట్టడి చేయొచ్చని చెబుతున్నారు.
Recommended Video

మానసికంగా బలపడేందుకు కౌన్సిలింగ్
ఇదిలా ఉంటే ప్రజలు వారి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని అన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. కోవిడ్ భయంతో హాస్పిటల్ భవనం పై నుంచి కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. మరోవైపు 14 రోజుల పాటు ఐసొలేషన్లో ఉన్న వ్యక్తి ఎక్కువగా డిప్రెషన్కు లోనై స్కీజోఫ్రీనియా జబ్బు తెచ్చుకున్నాడని మహేష్ భగవత్ చెప్పారు. ఇలా ఒత్తిడితో, మానసికంగా కృంగిపోవడం, ఒంటరిగా ఫీలవడం, భయం, బాధతో చాలా మంది ఉన్నట్లు గమనించామని అలాంటి వారికోసమే రాచకొండ పోలీసు మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా సైకో సోషల్ కౌన్సిలింగ్ను తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించినట్లు చెప్పారు. 2020లో లాక్డౌన్ సమయంలో ఈ పద్ధతిని అవలంబించామని గుర్తు చేసిన సీపీ, ఇక్కడ అందుబాటులో ఉన్న కౌన్సిలర్లు దాదాపు 200 కేసులకు పరిష్కారం చూపారని వెల్లడించారు.
మొత్తానికి కరోనా వచ్చినా, వస్తుందనో ఎలాంటి ఆందోళన చెందవద్దని వైద్యులు కోరుతున్నారు. భయపడితే శరీరంలోని పలు ప్రాముఖ్యం కలిగిన పారామీటర్లపై ప్రభావం చూపుతుందని తద్వారా మరింత నష్టం కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications