కొవిడ్ వ్యాక్సిన్లపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం -జులై 1 నుంచి తెలంగాణలో ఓపెన్ వ్యాక్సినేషన్
కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓపెన్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారంచుట్టింది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గురువారం నుంచి అందరికీ టీకాలు వేస్తారు.
వ్యాక్సినేషన్ పొందేందుకు అర్బన్ లోకల్ బాడీస్, జీహెచ్ఎంసీ పరిధిలో కొవిన్ యాప్ ద్వారా పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరోవైపు హై రిస్క్ ఉన్న గ్రూప్లకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు కొవిడ్ వ్యాక్సిన్లను అందించే కార్యక్రమానికి సర్కారు ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ పరిధిలో 100 జీసీవీసీ లను, అర్బన్ లోకల్ బాడీల్లో 204 జీసీవీసీలను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హత ఉన్నవారికి టీకాలు అందించనున్నారు. లబ్ధిదారులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు కోరారు. ఇదిలా ఉంటే,
తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 13,388 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా నుంచి 1,006 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇవాళ 1,09,802 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.