ఆర్టీసీపై తేల్చేస్తారా: కోర్టుకు ప్రభుత్వం ఏం చెబుతోంది: నష్టాల పైనే నివేదిస్తారా..కొత్త టెన్షన్..!
సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంతాలు వద్దు. కార్మిక సంఘాలతో చర్చలు జరపండి. కార్మిక సంఘాలు సమ్మె వీడండి. రెండు పక్షాలు గుడ్ న్యూస్ తో 18వ తేదీన కోర్టుకు రండి..అంటూ కోర్టు ఈ నెల 15న అటు ప్రభుత్వానికి..ఇటు ఆర్టీసీ జేఏసీకి స్పష్టం చేసింది. అయినా..పరిస్థితిలో ఎటువంటి పురోగతి లేదు. తాము చర్చలకు సిద్దమని జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం నుండి మాత్రం చర్చల పైన ఎటువంటి నిర్ణయం లేదు. ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చర్యల పైనే ప్రధానం ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి సైతం దీని పైనే చర్చలు చేసారు.
దీంతో..మరి కాసేపట్లో కోర్టు ముందుకు ఈ అంశం మరో సారి చర్చకు రానుంది. అయితే, ప్రభుత్వం చర్చలు చేయకపోవంతో కోర్టుకు ఏం నివేదిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. ఆర్టీసీ ఎదుర్కొంటున్న పరిస్థితి..నష్టాలను కోర్టుకు నివేదిస్తారని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదే సమయంలో కార్మిక సంఘాల్లో టెన్షన్ మొదలైంది. కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకంతో వారు కోర్టు వైపు ఉత్కంఠగా చూస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో మలి విచారణ
18వ తేదీ గుడ్ న్యూస్ తో రండి అంటూ కోర్టు చేసిన సూచనతో..సమస్య పరిష్కారం అవుతుందని అందరూ భావించారు. కానీ, సమ్మె కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం చర్చలు చేయలేదు. కార్మిక సంఘాలు తాము చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బీజీగా ఉంది. ఇదే సమయంలో కోర్టులో కాసేపట్లో మలి విడత విచారణ సాగనుంది. దీంతో..కార్మిక సంఘాలు మొదలు ప్రజలు వరకు అందరూ ప్రభుత్వం కోర్టుకు ఏమని నివేదిస్తుందనే అంశం పైనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
సమ్మె నివారణ చర్యలకు ముందుకు రాని ప్రభుత్వం..ప్రయాణీకులకు మాత్రం ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పటం ద్వారా తమ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతోంది. తాత్కాలిక పద్దతిన సిబ్బందిని నియమిస్తోంది. అయితే, ఇప్పుడు సమ్మెలో ఉన్న వారిలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కోర్టు వైపు చూస్తున్నారు. అయితే, కోర్టు ముందు ఏ రకంగా వ్యవహరించాలనే అంశం పైన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ నష్టాలు..ప్రభుత్వ చర్యలపైనే నివేదిక
కోర్టు తమకు కార్మిక సంఘాలతో చర్చల ప్రగతి పైన నివేదిక ఇవ్వాలని గత విచారణలో సూచించింది. కార్మిక సంఘాలు సైతం సమ్మెకు దిగటం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తాము చేస్తున్న వాదననే కోర్టు ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ ప్రస్తుత ఆర్దిక పరిస్థితి..అదే విధంగా తాము ఆర్టీసీని పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరిస్తారని ప్రభుత్వంలోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు.
దీని ద్వారా తాము కార్మికులు చేస్తున్న సమ్మె..వారి డిమాండ్లు అర్దరహితమని..తాము ఎందుకు చర్చలకు వెళ్లనిది వివరిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే కోర్టు చర్చలు చేయమని సూచించిన ఈ సమయంలో ఆ విషయానికి ప్రభుత్వం ఏ రకంగా సమర్ధించుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. అయితే కార్మిక సంఘాల జేఏసీ మాత్రం కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని చెబుతోంది.












Click it and Unblock the Notifications