కోటీశ్వర్ల నమ్మకం: 2.5 కోట్ల విలువైన ఏనుగు దంతాలివే (ఫోటో)
హైదరాబాద్: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని సైబరాబాద్ ఎస్వోటీ ఈస్ట్జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 2.5 కోట్ల విలువైన రెండు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ ఉడా కాలనీ మాధవరావుకు చెందిన వీకెఎస్ చంద్రబోస్ తిగిరిపల్లి అలియాస్ బోస్ చెన్నైలోని మధురై నుంచి ఏనుగు దంతాలను వైజాగ్కు తీసుకువచ్చాడు.
అవి దక్షిణాఫ్రికాలో అద్భుతంగా కార్వింగ్ చేసి మన దేశానికి వచ్చాయి. మధురైలో అవి చోరీకి గురయ్యాయి. వాటిని చౌక ధరకు చంద్రబోస్ కొనుగోలు చేశాడు. అమ్మడానికి వైజాగ్ శ్రీధర్ కాలనీకి చెందిన సాప్ట్వేర్ కంపెనీ యజమాని, పెప్సీ లోకర్ డిస్ట్రిబ్యూటర్ కంచర్లపాటి వెంకట సూర్యనారాయణ రాజును సంప్రదించాడు.
వీటిని అమ్మిపెడితే రూ. 30 లక్షల కమిషన్ ఇస్తానని వెంకట సూర్యనారాయణ రాజు తన వ్యాపార స్నేహితుడు మొదక్ జిల్లా పటాన్ చెరువు, అమీన్ పూర్, టైలర్స్ కాలనీలో నివసిస్తున్న ఎస్ఆర్ నగర్లో గల ట్రాన్స్టెక్ సాప్ట్వేర్ సోల్యూషన్స్ సంస్ధ సీఈఓ మన్ను ఫణిందర్ను సంప్రదించాడు.
ఏనుగు దంతాలను అమ్మడానికి మోతీ నగర్, సుల్తాన్ నగర్కు చెందిన నున్న అరవంద్ కుమార్ అలియాస్ అరవింద్ రెడ్డిని ఫణిందర్ సంప్రదించాడు. వీటిని అమ్మే ప్రయత్నంలో సూర్యనారాయణ రాజు, ఫణిందర్ అరవింద్ కుమార్ని కలుసుకోవడానికి అల్వాల్లోని ఫీల్డ్స్ కాలనీకి బుధవారం చేరుకున్నారని పోలీసులకు సమాచారం అందడంతో అరెస్ట్ చేసి దంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏనుగుకి కుడి, ఎడమ రెండు వైపులా దంతాలుంటాయి. ఈ రెండింటినీ కొనుగోలు చేసి వాటి మధ్యలో కూర్చుంటే ఎంతో మంచి జరుగుతుందని కోటీశ్వర్లు భావిస్తుంటారు. రెండు దంతాలు ఎడమవే కావడంతో వాటిని అమ్మడంలో ఆలస్యం జరిగి నిందితులు దొరికి పోయినట్టు తెలుస్తోంది.
ఏనుగు దంతాలను చెన్నై నుంచి వైజాగ్కు తీసుకొచ్చిన వీకెఎస్ చంద్రబోస్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రబోస్ దొరికితే ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమవుతాయి. ఏనుగు దంతాలు ఉంచుకోవాలనంటే అటవీ శాఖ అధికారుల అనుమతి పత్రం తీసుకోవాలి.
పోలీసులకు చిక్కిన నిందితుల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుడు సూర్యనారాయణ రాజుకు వాస్తు పరికరాలను అమ్మడంలో పరిజ్ఞానం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కమిషన్కు ఆశపడి ఇతడి స్నేహితుడు ఫణిందర్ కూడా స్మగ్లింగ్లో ఇరుక్కుపోయాడని పోలీసులు తెలిపారు.