అగ్ర కుల అమ్మాయిని ప్రేమించినందుకు.. మరో దళిత యువకుడిపై దాడి
తన సోదరికి మెసేజ్లు పంపుతున్న సెల్ఫోన్ ఇచ్చేయాలని బెదిరించాడు. దీంతో సెల్ ఫోన్ బంధవుల వద్ద ఉందని, మెసేజ్ చేసి చెప్పిస్తానని చెప్పాడు.
కరీంగనర్: తక్కువ కులమన్న కారణంతో దళిత యువకులపై దాష్టికాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మంథని మధుకర్, జమ్మికుంట రాజేశ్, యాదాద్రి నరేశ్ ఘటనలు కళ్ల ముందు కదలాడుతుండగానే.. మరో దళిత యువకునిపై అగ్రకుల దురహంకారం పేట్రేగిపోయింది. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక శ్రావణ్.. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన ఓ యువతి కూడా ఇదే కళాశాలో చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు.. తరుచూ సెల్ఫోన్ చాటింగ్ చేసేవారు.
ఈ విషయం ఇటీవల యువతి సోదరుడు సందీప్ రావుకు తెలియడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. శ్రావణ్కు ఫోన్ చేసి కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాకు పిలిపించాడు. అక్కడ జనమంతా చూస్తుండగానే బెల్టుతో అతన్ని చావబాదాడు. ఆపై గణేశ్ నగర్కు తీసుకెళ్లి.. రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టాడు. తన సోదరిని బెదిరించినట్లు బలవంతంగా ఓ లేఖ కూడా రాయించాడు.

తన సోదరికి మెసేజ్లు పంపుతున్న సెల్ఫోన్ ఇచ్చేయాలని బెదిరించాడు. దీంతో సెల్ ఫోన్ బంధవుల వద్ద ఉందని, మెసేజ్ చేసి చెప్పిస్తానని చెప్పాడు. అయితే ఆ మెసేజ్ లో తనపై దాడి జరుగుతున్నట్లు బంధువులకు సమాచారం అందించడంతో.. వారు వెంటనే టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సందీప్ రావుకు ఫోన్ చేసి శ్రావణ్ కొట్టవద్దని, వెంటనే స్టేషన్కు రావాలని హెచ్చరించారు.
దీంతో సందీప్రావు శ్రావణ్ ను తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సందీప్ రావు, అతని స్నేహితులు కపిల్ రాజు, పాకాల సంపత్ రెడ్డిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో నిందితుడు వేల్పుల మల్లేష్పై కిడ్నాప్, దాడి కేసు పెట్టారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. కాగా, తనకు సందీప్ రావు నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్రావణ్ పోలీసులను అభ్యర్థించడం గమనార్హం.












Click it and Unblock the Notifications