హైడ్రా కూల్చివేతలతో.. వర్షంలోనే పేదలు: కేటీఆర్ వీడియో ట్వీట్
హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించిన కేటీఆర్.. ఓ వీడియోను కూడా జత చేశారు.
హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాను బయటపడేయడంతో వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకుని వారు తలదాచుకున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలాంటి హృదయ విదారక ఘటనలను చూసే పరిస్థితి రాదని అన్నారు. మానవ పునరావాస విధానాలతో బయటకు రావాలని.. ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
ఇవ్వాళ రేవంత్ సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీరు
— KTR (@KTRBRS) September 8, 2024
జోరు వానలో
కనికరం లేని సర్కారు
కర్కశంగా గూడు కూల్చేస్తే
దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో
తలదాచుకుంటున్న అభాగ్యులు.
పేరుకేమో ప్రజా ప్రభుత్వం.
కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు!
About 40,000 Double Bedroom houses that have been… pic.twitter.com/TqBktAnKuX
ఇది ఇలావుంటే, ప్రజలు నివాసం ఉండే నివాసాలను తాము కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ ఆదివారం స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని కమిషనర్ తెలిపారు. బఫర్జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని తెలిపారు.
మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయని, బఫర్జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చెప్పారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్నిషెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని, గతంలో కూడా వాటిని కూల్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు.
బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే, ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications