కేసీఆర్! రేపు మేమూ మీలాగే చేస్తే పరిస్థితి ఏంటి: రేవంత్ ఇంటికి డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటికి ఆ పార్టీ నేత డీకే అరుణ శుక్రవారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసం వద్ద మాట్లాడారు. ఐటీ, ఈడీ దాడులు కక్ష సాధింపు చర్యలే అన్నారు. తెరాసకు రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేదన్నారు.
Recommended Video
రేవంత్ చుట్టు బిగుస్తోన్న ఉచ్చు: తెరపైకి ఓటుకు నోటు, అరెస్ట్కు రంగం? రంగంలోకి డీఆర్ఐ
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక మేమూ ఇలాగే చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెరాసకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. తమిళనాడు రాజకీయాలు చక్కటి ఉదాహరణ అన్నారు. తెరాస కుటుంబమే రాష్ట్రాన్ని పాలించాలనే కుట్ర జరుగుతోందన్నారు.
తెలంగాణ ప్రజలు బానిసలుగా బతకాలని తెరాస ఆలోచన చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఈ దొరల పాలనకు చెక్ పెట్టడం ఖాయమని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని వ్యాఖ్యానించారు.
తెలంగాణను తెరాస దోచుకుంటోందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. కేసులు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని బెదిరింపులు మంచిది కాదన్నారు. మీరు చేతకాని దద్దమ్మలు అయి తమను ఎదుర్కోలేక కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.