జోగులాంబతో పెట్టుకున్నావ్.. నీ పతనం మొదలైనట్టే కేసీఆర్: డీకే అరుణ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రకటించడం తో పాటు, తెలంగాణ బీజేపీ నాయకులపై, కేంద్రంలోని బిజెపి పాలకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పై వివక్ష చూపుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ ప్రెస్ మీట్ పై తెలంగాణ బిజెపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
ప్రజల్లోకి పోలేక గంటలకొద్దీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు కేసీఆర్
జోగులాంబతో పెట్టుకున్నావ్.. నీ పతనం మొదలైనట్టే కేసీఆర్ అంటూ మండిపడ్డారు డీకే అరుణ. సీఎం కేసీఆర్ ప్రజల్లోకి పోలేక ప్రెస్ మీట్లు పెట్టి గంటలకొద్దీ మాట్లాడుతున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇక ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేక్కేస్తారని డీకే అరుణ ఆరోపణలు గుప్పించారు. జోగులాంబ అమ్మవారిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పతనం ప్రారంభమైందని డీకే అరుణ పేర్కొన్నారు. జోగులాంబ అమ్మవారు కెసిఆర్ కి తగిన శాస్తి తప్పక చేస్తుందని డీకే అరుణ స్పష్టం చేశారు.
నీ పతనం మొదలైంది ... డీకే అరుణ హెచ్చరిక
హిందూ దేవతలపై అహంకారపు మాటలా కెసిఆర్...అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ భద్రకాళి, జోగులాంబ అమ్మవారిని స్మరిస్తే దానిని అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పదే పదే హిందూ జీవన విధానాన్ని అవమానించేలా మాట్లాడటం, దేవతా మూర్తుల పేర్లను అవహేళన చేయడమేనా కెసిఆర్ నైజం అంటూ డీకే అరుణ నిప్పులు చెరిగారు. దేవతలను, మహిళలను అవమానపరిచిన వారు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. మీ రాజకీయ ముగింపు దగ్గర పడినట్లేనని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ నాయకులే చిల్లర..
బిజెపి నాయకులను చిల్లర నా కొడుకులు అంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన డీకే అరుణ టిఆర్ఎస్ నాయకులు చిల్లర నా కొడుకులు అంటూ ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రధాని మోడీకి లేదని పేర్కొన్న డీకే అరుణ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కెసిఆర్ కుటుంబ పాలనను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగి ఇన్ని రోజులైతే ఇంతకాలానికి కేసీఆర్ మాట్లాడటం కేవలం రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించే కుట్ర అని ఆమె మండిపడ్డారు.
వర్షాలపై జనం ఫోకస్ చెయ్యకుండా దృష్టి మళ్ళించటం కోసమే ప్రెస్ మీట్లు
ప్రధాని మోడీపై కెసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ,మండిపడిన డీకే అరుణ కేసీఆర్ నోరు దగ్గర పెట్టుకోకుంటే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరి బీజేపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు.