హరీశ్ రావుకు హైకోర్టులో మళ్లీ ఊరట
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావును ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును క్యాస్ చేయాలని హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గతంలో మధ్యంత ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

అక్రమ అరెస్టులపై హరీశ్ రావు ఫైర్
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని హరీశ్ రావు ఖండించారు. డంపింగ్ యార్డు ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కి.. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.
రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి నుంచి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని నిలదీశారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని హరీశ్ రావు నిలదీశారు. ప్రజాపాలన అంటూ ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అంతేగాక, డంపింగ్ యార్డు నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications