ఒమిక్రాన్ థర్డ్ వేవ్ భయం వద్దు.!అన్ని ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామన్న మంత్రి హరీష్.!
హైదరాబాద్ : కోవిడ్-19 ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామనే సంకేతాలనిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే వివిధ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల మీద దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. వైద్య ఆరోగ్య శాఖ బాద్యతలను చేపట్టిన మంత్రి హరీష్ రావు ఆసుపత్రుల ప్రక్షాళన, సౌకర్యాలు, మెరుగైన సేవలు, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు తదితర కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. మంగళవారం నిమ్స్ ఆసుపత్రిని సాంకేంతికంగా అప్ గ్రేడ్ చేసేందుకు పూర్తి సహకారం అందించిన మంత్రి హరీష్ రావు నేడు కొండాపూర్ లోని జిల్లా ఆసుపత్రిని ఆధునీకరించేందుకు రంగం సిద్దంచేసారు.
మూడో వేవ్ ను ఎదుర్కోడానికి సిద్దం..అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను మెరుగుపరుస్తున్నామన్న హరీష్ రావు
ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు వైద్య,ఆరోగ్య శాఖను అదనంగా కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. క్లిష్ట సమయంలో సవాల్ గా మారిన శాఖను ఈటల రజేందర్ ఉద్వాసన తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు స్వయంగా పర్యవేక్షించారు. కొన్నాళ్ల తర్వాత ఆ శాఖను ఆర్థిక శాఖను చూస్తున్న హరీష్ రావుకు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ బాద్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల పరిస్థితి పైన సమీక్షనిర్వహించిన హరీష్ రావు ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల ఏర్పాటు అవసరమని గ్రహించారు. ఈ మేరకు మొదట నిమ్స్ ఆసుపత్రిని ప్రక్షాళన చేసిన మంత్రి హరీష్ తాజాగా కొండాపూర్ ఆసుపత్రిపై దృష్టి సారించారు.
పడకలకు కొరతలేదు.. ప్రతి ఆసుపత్రిని ఆధునీకరిస్తున్నామన్న మంత్రి హరీష్
అంతే కాకుండా కోవిడ్-19 ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సంసిద్దం చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగా మదాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్పోరేషన్ సంస్థ ముందుకు వచిందని తెలిపారు. 100 పడకల ఫ్లోర్ ని బుదవారం ప్రారంభించుకున్నామని, కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసుకున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు.
అన్ని జిల్లాల్లో మెరుగైన సౌకర్యాలు.. కోవిడ్ కు భయపడొద్దన్న మంత్రి
33 జిల్లాల్లో 6000 పడకలతో చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ విభాగాలు అందుబాటిలోకి తీసుకురావాలని హరీష్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం మూడో వేవ్ ను అధిగమించే వ్యూహంతో సిద్దంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయని మంత్రి హరీష్ తెలిపారు. 154 కోట్ల రూయాలతో 900 లకు పైగా icu బెడ్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. డయాలసిస్ యూనిట్ ల పెంపుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు.
ప్రయివేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు.. అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్న హరీష్
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేరుతో కేసీఆర్ కిట్ వచ్చాక 52% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని హరీష్ తెలిపారు. కొండాపూర్ లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేటర్ సంస్థలు తమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ అందేలా చూడాలని, రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి ఆరా తీయాలని, వ్యాక్సినేషన్ 100% జరగాలంటే ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. 3.96 లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేసామని, రోజు సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు.