నిరూపించే దమ్ముందా .. ? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలని.. బెదిరింపు రాజకీయాలకు తాను భయపడనని చెప్పారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. నిజంగా రేవంత్కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీని అడిగి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. హామీలు, పథకాల అమలు విషయంలో తమపై తోసేసి చేతులు దులిపేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా? అని గళమెత్తారు. తాను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజంగా రేవంత్కు దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలను నిరూపించాలని తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్రెడ్డి అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్.. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్. మెట్రో విస్తరణలో తనకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి.. తన హయాంలో జరగవద్దు అని కిషన్ రెడ్డి భావిస్తున్నారన్నారు.
అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధానికి ఇచ్చిన విజ్ఞప్తులను బాధ్యత వహించి కేబినెట్ ఆమోదం తేవాల్సిన బాధ్యత కిషన్రెడ్డి, సంజయ్లదే అని సీఎం ప్రస్తావించారు.మెట్రో విస్తరణ కేబినెట్ ముందుకు రాకుండా కిషన్రెడ్డి అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తామని.. గండపెండేరం తొడుగుతానని తెలిపారు.












Click it and Unblock the Notifications