టిడిపి, కాంగ్రెస్లకు గ్రామస్థుల షాక్: హరీష్ రావు ఆనందం
మెదక్: ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు తాము ఒప్పుకుంటున్నామని మెదక్ జిల్లా తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామస్తులు ప్రకటించారు. గజ్వెల్లో బుధవారం మంత్రి హరీష్ రావు గ్రామస్తులతో చర్చలు జరిపి, సఫలమయ్యారు.
ఇది విపక్షాలకు షాక్ అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షలాది మంది రైతులకు సాగునీరు అందుతుందని, తద్వారా రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారని అన్నారు. తమను ఆదుకుంటామని చెప్పారన్నారు.
మల్లన్న సాగర్కు రైతులు స్వచ్చంధంగా భూములు ఇస్తున్నారని, వారిని ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పారు. వారికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని వారు చెప్పారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
2013 భూసేకరణ చట్టమైనా, ఇంకే చట్టమైనా సరే ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ప్రజల అంగీకారం అవసరం లేదని హరీష్ రావు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏపీలో రాజధాని కోసం వేలాది ఎకరాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

హరీష్ రావు
మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఆరు గ్రామాల్లో భూసేకరణ ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా పల్లెపహాడ్ కూడా అదే కోవలో ప్రయాణించింది. మరో మూడు గ్రామాల్లో మాత్రమే భూసేకరణ ముందుకుసాగాల్సి ఉంది. లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని సమకూర్చే మల్లన్నసాగర్పై కమ్ముకున్న మబ్బులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని హరీష్ రావు అన్నారు.

హరీష్ రావు
భూములను ఇస్తామన్న పల్లెపహాడ్ గ్రామస్థుల నిర్ణయం మరిచిపోలేనిదని హరీష్ అన్నారు. పల్లెపహాడ్ వాసులు భూములను అప్పగించడానికి ముందుకురావడం శుభసూచకమని, దీంతో రిజర్వాయర్ పనులు ప్రారంభానికి మరో అడుగు ముందుకు పడిందన్నారు. మిగతా గ్రామాల ప్రజలతో కూడా చర్చించి వారి సమ్మతితోనే భూసేకరణ జరుపుతామన్నారు.

హరీష్ రావు
బలవంతంగా భూములు ఎవరినుంచి తీసుకోబోమన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నాయని, ప్రాజెక్ట్ నిర్మించకుండా ఆలస్యం చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్న ఆవేదన కూడా వారిలో లేదన్నారు.ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం గాలిబుడుగల వంటిదని, వారిని పట్టించుకోవద్దన్నారు.

హరీష్ రావు
ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం లేని అవాస్తవాలను భూతద్దంలో చూపిస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ కోసమే ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఓటమి ఎరుగని నాయకుడని, ప్రజలకిచ్చిన మాట తప్పరని చెప్పారు. పల్లెపహాడ్వాసుల విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పల్లెపహాడ్ గ్రామాన్ని పునర్నిర్మించి ఇవ్వడానికి సీఎం తప్పకుండా అంగీకరిస్తారన్నారు.












Click it and Unblock the Notifications