గుర్తు కోసం ఈసి పిలుపు: సంక్రాంతి సంబరాలకు పవన్ కల్యాణ్ దూరం
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ జనసేనకు ఎన్నికల కమిషన్ (ఈసి) నుంచి పిలుపు వచ్చింది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీలో ఉన్న పార్టీల వివరాలను ఈసి ప్రకటించింది.
ఈ పరిస్థితిలో తమ వద్ద ఉన్న మొత్తం 81 ఫ్రీ సింబల్స్లో ఏదైనా ఒక గుర్తును ఎంచుకోవాలని ఈసి ప్రతిపాదించినట్లు సమాచారం. గుర్తు ఎంపిక కోసం పవన్ కళ్యాణ్కు ఈసి నుంచి పిలుపు వచ్చింది. ఒక వేళ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే ఏదైనా గుర్తును ఎంపిక చేసుకోవాలని సూచించింది.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, తమ తరఫున ప్రచారం చేయాలని బిజెపి, తెలుగుదేశం కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ను కోరుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఏ విధమైన హామీ ఇచ్చినట్లు లేదు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తన పార్టీని పోటీకి పెడుతారా, లేదా అనేది కూడా ఆయన తేల్చలేదు.
ఇప్పటికే జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తుండడమే కాకుండా ప్రచారబరిలోకి కూడా దిగాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేదనే మాట వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమి తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనేది తేలడం లేదు.
గబ్బర్సింగ్, గోపాల గోపాల వంటి హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ పవన్కళ్యాణ్ సర్దార్ గబ్బర్సింగ్తో వస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా షూటింగ్ను ముమ్మరం చేసింది. సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావించిన పవన్ షూటింగ్కోసం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్సింగ్ షూటింగ్ ఈ నెల చివరి వరకు నగరంలోనే కొనసాగనుంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో వేసిన రూ.5కోట్ల బారీ సెట్లో 20రోజులపాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. సినిమా షూటింగ్ కోసం పవన్తో పాటు చిత్రం యూనిట్ కూడా సంక్రాంతి సంబురాలకు దూరం కానుందని సమాచారం.
కాగా, గ్రేటర్ ఎన్నికలపై కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో అన్ని పార్టీల ఫ్లెక్సీలను, హోర్డింగులను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభ్యర్థులు ఐదు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేయరాదని ఆయన చెప్పారు.