ఈసి పద్దతి బాగాలేదు..! బేరసారాలకు అవకాశమిచ్చేలా ఉందన్న టీపిసిసి..!!
హైదరాబాద్ : ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరును తెలంగణ కాంగ్రెస్ కమిటీ ఖండించింది. పరిషత్ ఎన్నికలకు, ఫలితాలకు మద్య అంత సమయం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే జడ్పీ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష( ఎంపీపీ) ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి పేర్కొనడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతోపాటు బేరసారాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు.
జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి..! డిమాండ్ చేస్తున్న టీపిసిసి..!!
మాజీ మంత్రి షబ్బీర్అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్, రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు డీసీసీ అధ్యక్షులతో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం గాంధీభవన్లో మాట్లాడారు. సాధారణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే జడ్పీ ఛైర్మన్, ఎంపీపీల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 27న ఓట్ల లెక్కింపు పూర్తయితే.. జులై 5న అంటే దాదాపు నెల తర్వాత ఈ పదవుల ఎంపిక చేపడతామని నాగిరెడ్డి చెప్పడం హాస్యస్పదం అన్నారు.
ఈసి విధానం తప్పు..! ప్రలోభాలకు అవకాశం ఉంటుందన్న కాంగ్రెస్..!!
ఓట్ల లెక్కింపు తర్వాత ఇంత జాప్యం చేయడం వల్ల సభ్యుల కొనుగోళ్ల పర్వానికి తెర తీసినట్లవడంతోపాటు క్యాంపు రాజకీయాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం నిబంధనలకు విరుద్దంగా ఉందన్నారు. దీనిపై అన్ని పార్టీలతో కలిసి నాగిరెడ్డిని కలుస్తామని చెప్పారు. ఒకవేళ ప్రస్తుత జడ్పీ ఛైర్మన్, ఎంపీపీల పదవీ కాలం జులై వరకు ఉంటే.. ఇప్పుడు ఓట్ల లెక్కింపు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి గడువు తర్వాతే కొత్తవారు బాధ్యతలు చేపట్టేలా చూడాలన్నారు. లేదంటే ఓట్ల లెక్కింపు కూడా జులైలోనే చేపట్టాలని కోరారు. ఈ విషయాలను నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామని ఉత్తమ్ తెలిపారు.
ఘనంగా రాజీవ్ వర్థంతి..! అందరూ పాల్గొనాలన్న ఉత్తమ్..!!
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీ అభ్యర్థులకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అవగాహన కల్పించినట్లు ఉత్తమ్ తెలిపారు. దీనికి వివిధ జిల్లాల అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 21న అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
రాహుల్ ప్రధాని కావడమే మాకు ముఖ్యం..! ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన..!!
టీఆర్ఎస్ మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే.. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారం కంటే దేశ అభివృద్ది కోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావడమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకుని ఉంటే... ప్రాంతీయ పార్టీలు ఇన్ని వచ్చేవి కాదన్నారు. తప్పు ఎవరైనా చేస్తారు...వాటిని దృష్టిలో పెట్టుకుని గులాబీ నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా..ఉత్తమ్నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తానని, లేదంటే రేవంత్రెడ్డికి అవకాశం కల్పించాలని కోరుతానన్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేణుకాచౌదరిలకు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.