తెలంగాణలో ఆ మూడు రోజులు డ్రై డే
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ప్రకటించింది. పోలింగ్ జరిగే రోజు నవంబర్ 30న సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (election commission) ఆదేశించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సీఈసీ, ఇతర కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలంగాణ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణఖు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సీఎస్ శాంతి కుమారి వివరించారు.
ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిఘా పెంచామని, ఫలితంగా ఇప్పటి వరకు రూ. 385 కోట్ల మేర నగదు జప్తు చేసినట్లు చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 17 జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.
సరిహద్దు రాష్ట్రాలతో సమర్థమైన సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. ఇక, నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లు వివరించారు. కాగా, తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications