బీఆర్ఎస్కు బిగ్ షాక్: కవిత ఇంటిపై ఈడీ దాడులు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల వేళ కలకలం..
లోక్సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సంభవించిన ఈ పరిణామం.. బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతున్న ఈ పరిస్థితుల్లో- సాక్షాత్తూ బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తెపై ఈడీ కొరడా ఝుళిపించడం చర్చనీయాంశమౌతోంది.

పలు ఆరోపణలు..
కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో రెండు మూడుసార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కూడా. ఆ తరువాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులు అందాయి.

ఈడీ దాడులు..
ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు సైతం కవితకు సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగలేదు. ఆ తరువాత కవిత పేరును ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లు వార్తలు సైతం వెల్లువెత్తాయి గతంలో. తాజాగా హైదరాబాద్లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగడం అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమౌతోంది.

అరెస్టులూ..
ఇదివరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్.. విచారణను ఎదుర్కొంటోన్నారు. జైలు జీవితాన్ని గడుపుతోన్నారు. మరికొందరు ఇతర పార్టీల నాయకులూ అరెస్ట్ అయ్యారు.
రాజకీయ కక్షసాధింపుచర్యగా..
మార్చి 16వ తేదీన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా ఈడీ ఈ దాడులకు దిగడం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని తారుమారు చేయవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. దీన్ని రాజకీయ కక్షసాధింపుచర్యగా అభివర్ణిస్తోంది బీఆర్ఎస్.












Click it and Unblock the Notifications