పత్రికా కార్యాలయంలో ఈడీ సోదాలు - రాజకీయ కలకలం..!!
చిన్న గ్యాప్ తరువాత మరోసారి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు చేసిన ఈడీ..ఈ రోజు మరోసారి సోదాలు కొనసాగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్లతో పాటు హైదరాబాద్లోనూ సోదాలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సమయంలో 35 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే తెలుగు రాస్ట్రాలకు చెందిన కొందరి పేర్లు తెర పైకి వచ్చాయి. అయితే, ఆ నేతలు ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ వచ్చారు.
కొద్ది రోజుల క్రితం ఈడీ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలు..లిక్కర్ వ్యాపారులు - మధ్య వర్తులకు ఇదే కేసులో నోటీసులు జారీ చేసింది. ఉదయం నుంచి ఈడీ అధికారులు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ల తో పాటుగా లిక్కర్ కంపెనీలు, వాటికి సంబంధించిన పలు అనుబంధ సంస్థలకు చెందిన ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా మారిన సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈడీ సోదాలు ఒక తెలుగు పత్రికా కార్యాలయంలో నూ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థకు సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్ కూడా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సంస్థలో ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీంతో..ఆ వ్యక్తికి సంబంధించిన పెట్టుబడుల పైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది, ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆయన తనకు ఈ అంశంలో ఎటువంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. దాదాపుగా 50 సంవత్సరాలుగా తమ కుటుంబం ఈ వ్యాపారంలో ఉందని, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పైన అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఈడీ నోటీసులు అందుకున్న వారిలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ..ఢిల్లీ లో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖులు ఉన్నారు.